కేసీఆర్ కు తెలంగాణా యాపిల్స్ అందించిన రైతు .. అభినందించిన తెలంగాణా సీఎం
తెలంగాణ రైతాంగం ఎటువంటి పంటలనైనా పండించగలరు అని నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాపిల్ సాగు చేశాడు ఓ రైతు. చల్లని వాతావరణంలోనే సాగయ్యే యాపిల్ పంటను తెలంగాణ రాష్ట్రంలోనూ పండించి చూపించిన ఆ రైతు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణా తొలి పంట అయిన యాపిల్స్ ను సీఎం కేసీఆర్ కు అందించారు.
Recommended Video
తెలంగాణా యాపిల్ నోరూరిస్తుంది: ప్రయోగం సక్సెస్ అయ్యి ఆ రైతు పంట పండింది
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పండిన యాపిల్ పండ్లను సీఎం కేసీఆర్ కు అందించడంతో కెసిఆర్ రైతును అభినందించారు. కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలం ధనోరాకు చెందిన కేంద్రె బాలాజీ గత నాలుగు సంవత్సరాలుగా యాపిల్ సాగుచేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయ సహకారాలతో,చాలా జాగ్రత్తగా యాపిల్ సాగుచేసిన బాలాజీ మొదటి పంట పడడంతో తెలంగాణ యాపిల్స్ బుట్టను సీఎం కేసీఆర్ కు అందించారు. రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 రకం యాపిల్ పంట సాగు చేసిన బాలాజీని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు.
తెలంగాణ నేల విభిన్నరకాల స్వభావం కలిగిన నేల అని చెప్పడానికి ఇక్కడి నేలలో పండిన యాపిల్ పండు ఒక ఉదాహరణ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఇక ఈ రైతును ఆదర్శంగా తీసుకొని సిమ్లా,కాశ్మీర్ యాపిల్ కు ధీటుగా తెలంగాణ యాపిల్ కూడా పండించాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఉద్యానవన శాఖ యాపిల్ సాగుకు ఎంతో సహకారాన్ని అందించింది అని యాపిల్ పంట పండించిన రైతు కేంద్రే బాలాజీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో యాపిల్ సాగులో ముందుకు వెళ్తామని ఆయన ఉత్సాహంగా చెప్పారు. ఇక ఈ తెలంగాణ యాపిల్ మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానుంది.