ఓ మీడియా ఆఫీస్ ముందు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ధర్నా..! తన ఓటమికి కారణం ఈ పత్రికే..!!
హైదరాబాద్ : తెలంగాణలో ఓ పత్రిక తనపైన అవాస్తవాలు ప్రచురించడంతో తాను ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఆ మాజీ తన ఆవేదనను వ్యక్తం చేసారు. అంతే కాకుండా తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఆ వార్తా పత్రికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదే పత్రికా కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు.
తన ప్రత్యర్థిని గెలుపించేందుకు తనపై అసత్యాలు రాసి పత్రికా గౌరవానికి భంగం కలిగించారని యాజమాన్యం పై మండిపడ్డారు. వార్త పత్రికలు, న్యూస్ ఛానెల్స్ అంటే ప్రజల్లో అపారమైన నమ్మకం ఉందని. రాజకీయ నాయకులుగా తాము చెప్పేది ప్రజలు నమ్ముతారో లేదో తెలియదు కానీ పత్రికల్లో వచ్చే వార్తలు మాత్రం ప్రజలు వెంటనే నమ్ముతారని సదరు మాజీ ఎమ్మెల్యే వాపోయారు.
తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, శక్తి మేరకు కస్టపడి సంపాదించుకున్నానని ఆయన తెలిపారు. 1994 నుండి ఇప్పటి వరకు 1 కోటి 9 లక్షల రూపాయల విలువైన ఆస్తులు అమ్ముకున్నానని, అప్పటి నుండి ఇప్పటి వరకు కొనుక్కున్నవి కోటి 40 లక్షల రూపాయలు ఆస్తులు మాత్రమేనని తెలిపారు. ఇవ్వన్నిపక్కన పెట్టి 900 కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించానంటూ తనపై ఆ పత్రిక బురదచల్లే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు.
వీటంతటికి పత్రికా యజమాని cl రాజాం బాద్యత వహించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ డిమాండ్ చేసారు. తన బంధువు శ్రీధర్ బాబు విజయం కోసం ఏ అండా లేని తనపై తప్పుడు ప్రచారం చేసారని ఆరోపించారు. ఇంత నీచానికి ఒడిగట్టిన రాజాం దుర్భుద్ధిని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశ్యం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మధుకర్ తెలిపారు.