తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని .. గద్వాల జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా తహసీల్దార్ కార్యాలయాల వద్ద పరిస్థితి మారటం లేదు . తహసీల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా తహసీల్దార్ కార్యాలయాల వద్ద చోటు చేసుకునే ఏదో ఒక ఘటన తహసీల్దార్ విజయారెడ్డి ఘటనని గుర్తు చేస్తూనే ఉంది . తాజాగా మరో తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో వెళ్ళిన ఓ రైతు అక్కడ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి కలకలం రేపాడు.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు చేసిన పని అందర్నీ షాక్ కు గురి చేసింది. తన భూ సమస్య పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన ఓ రైతు తన సమస్యకు పరిష్కారం లభించకపోవటంతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు . చివరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని భావించిన రైతు శేఖర్ రెడ్డి తనతో పాటు పెట్రోల్ తెచ్చుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించాడు .
తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను శరీరంపై పోసుకున్న రైతు శేఖర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చెయ్యటంతో అక్కడి వారు వెంటనే అతన్ని వారించి ఆపారు. అక్కడే ఉన్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమి సమస్య పరిష్కరించడం లేదని రైతు ఆవేదన చెందాడు. అతడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు నచ్చజెప్పారు.