కన్నకూతురిని అమ్మిన కసాయి తండ్రి.. హైదరాబాదులో ప్రత్యక్షం, గర్భం దాల్చిన చిన్నారి
ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని భావిస్తారు. కొందరు మాత్రం ఆడపిల్లను అంగడిలో సరుకులానే చూస్తున్నారు. ఎంత తొందరగా వారి భారం వదిలించుకుందామా అనే ఆలోచనతో ఉన్నారు. డబ్బులకు ఆశపడి కన్నవారే ఆ బంగారు తల్లులను అమ్మకానికి పెడుతున్నారు. చిన్న వయస్సులోనే వారి కలలను చెదరగొడుతున్నారు. ఆడుకునే వయస్సులో పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు ఇంకా ఈ దేశంలో అక్కడక్కడ దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ తండ్రి తన 13 ఏళ్ల బాలికను డబ్బుల కోసం అమ్మిన విషయం వెలుగులోకి వచ్చింది.
డబ్బుకు కూతురిని అమ్మిన కసాయి తండ్రి
రాజస్థాన్కు చెందిన ఓ తండ్రి 13 ఏళ్ల కూతురును రూ.7 లక్షలకు అమ్మాడు. ఆ చిన్నారిని హైదరాబాదులో కనుగొన్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు. బాలిక అదృశ్యం అయిందని ఈ ఏడాది జూన్లో పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేయగా తండ్రే దోషి అని తేలడంతో ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక బాలిక ఎక్కడుందో కనుగొనే ప్రయత్నం చేసిన పోలీసులు చివరకు సక్సెస్ అయ్యారు.
గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక
బాలిక హైదరాబాదులో ఉన్నట్లు కనుగొన్నామని పోలీసులు చెప్పారు. చిన్నారిని బామర్కు తీసుకువచ్చినట్లు చెప్పిన జిల్లా ఎస్పీ శరద్ చౌదరీ ప్రస్తుతం తల్లికి అప్పగించినట్లు వెల్లడించారు. ఇక చిన్నారిని నవంబర్ 15న రాజస్థాన్ హైకోర్టులో ప్రవేశపెడతామని వెల్లడించారు. అయితే ఇక్కడ విషాదకరమైన అంశం ఏమిటంటే ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని ఎవరో గర్భవతిని చేశారు. ఆ చిన్నారి ప్రస్తుతం 4 నెలల గర్భిణీ అని పోలీసులు తెలిపారు.
జూన్ 30న రాజస్థాన్లో కిడ్నాప్ కేసు నమోదు
జూన్ 30వ తేదీన తన మేనకోడలు అదృశ్యమైందని ఎవరో కిడ్నాప్ చేశారని ఓ వ్యక్తి స్టేషన్లో ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. జూన్ 22న ఓ గోపా రామ్ మాలి అనే మధ్యవర్తి బాలిక తండ్రి దగ్గరకు వచ్చి బాలికకు ఓ మంచి సంబంధం కుదిర్చామని త్వరలో గొప్పింటి కోడలు అవుతుందని చెప్పినట్లు ఫిర్యాదులో బాలిక మేనమామ పేర్కొన్నాడు. అయితే తండ్రి బాలికను సివానాకు తీసుకెళ్లాడని అక్కడే సంబంధం కుదిరిందని చెప్పాడు. సాయంత్రం కల్లా ఇంటికి తండ్రి చేరుకున్నాడు కానీ పక్కన చిన్నారి మాత్రం కనిపించలేదని మేనమామ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బిడ్డ ఎక్కడని అడుగగా మేనమామ ఇంట్లో వదిలినట్లు తండ్రి చెప్పాడు. అయితే జూన్ 26న చిన్నారి అక్కడ లేదని తెలిసింది. అయితే ఎవరో బాలికను కిడ్నాప్ చేశాడని తండ్రి చెప్పుకొచ్చాడు.
తీగ లాగితే డొంక కదిలింది
తండ్రిపైనే అనుమానం వచ్చిన పోలీసులు కూపీలాగారు. దీంతో డొంక కదిలింది. తనే రూ. 7లక్షలకు బాలికను అమ్మినట్లు చెప్పాడు. దీంతో తండ్రిని జైలుకు పంపారు పోలీసులు. అయితే పోలీసులు చిన్నారి ఆచూకీ కనుగొనడంలో విఫలమయ్యారు. దీంతో చిన్నారి మేనమామ రాజస్థాన్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 15న కేసుకు సంబంధించి వాదనలు జరగనున్నాయి.