ఆ భయమే .. తెలంగాణాలో మూడు వేలకు పైగా స్కూళ్ళు బంద్ కు కారణమా?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సర్కారు బడులలో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం అధిక సంఖ్యలో చేరి చదువుకుంటుంటే, తెలంగాణా స్కూల్స్ మాత్రం ప్రమాదం అంచున ఉన్నాయి. విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదివేందుకు మొగ్గు చూపకపోవటంతో వేల సంఖ్యలో స్కూళ్ళు మూత పడుతున్నాయి. తెలంగాణలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లను దగ్గరలోని హైస్కూళ్లల్లో విలీనం చేయాలని ప్రభుత్వం గత కొంతకాలంగా భావిస్తుంది. ప్రభుత్వం ఆదిశగా అడుగులేస్తే మూడు వేలకు పైగా స్కూళ్ళు మూతపడే పరిస్థితి ఉంది.
ఇక తెలంగాణా రాష్ట్రంలో స్కూళ్ళను మూసివేత దిశగా ప్రభుత్వం ఆలోచించటంపై తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ సంస్థ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట ఇలా దాదాపు 3,500 స్కూళ్లను మూసివేయాలనుకుంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఇక స్కూళ్ళు మూసివేస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎంతో నష్టపోతారని వారు అంటున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసిన పక్షంలో స్కూళ్లల్లో డ్రాప్ అవుట్స్ మరింత పెరిగే ప్రమాదం వుందని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక చోట్ల ప్రభుత్వ స్కూళ్లు దూరంగా ఉంటున్నాయి. ఇక అక్కడికి వెళ్ళలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రాధమిక పాఠశాలలను కూడా మూసేసి వాటిని ఆయా స్కూల్స్ కు దగ్గరగా ఉన్న హై స్కూల్స్ లో రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా విలీనం చేస్తే చాలా మంది పిల్లలు చదువు మానేసే ప్రమాదం వుంది. దూరంగా ఉన్న స్కూల్స్ కు వెళ్ళలేక వారు చదువుకు స్వస్తి చెప్తారని ఆందోళన చెందుతున్నారు తెలంగాణా టీచర్స్ ఫెడరేషన్ బాధ్యలు. గతంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంది.. కానీ టీచర్ల ఆందోళనతో దానికి స్వస్తి పలికింది. అయితే ఉపాధ్యాయుల నియామకం వల్ల విద్యారంగానికి బడ్జెట్ పెరుగుతుందన్న భయమే స్కూళ్ళ మూసివేతకు అసలు కారణం అని వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం స్కూళ్ళ మూసివేత ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నారు.