రీయింబర్స్ జాడేది?.. అకాడమిక్ ఇయర్ ఎండింగ్.. విద్యార్థుల్లో టెన్షన్
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అకాడమిక్ ఇయర్ ముగుస్తున్నా కూడా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. అటు కాలేజీ యాజమాన్యాలు బకాయిల గురించి విద్యార్థులపై వత్తిడి పెంచుతున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం 2250 రూపాయల కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 301 కోట్లు మాత్రమే విడుదల కావడం గమనార్హం.
మస్కట్ లో మనోళ్ల కష్టాలు.. జీతాల్లేవు, తిండి లేదు.. సర్కార్ సాయం కోసం ఎదురుచూపు
రీయింబర్స్మెంట్ జాడేది?
అకాడమిక్ ఇయర్ అయిపోవస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియ మాత్రం అటకెక్కింది. నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. విద్యా సంవత్సరం ముగిసేలోగా 13 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంది. అందులో 20 శాతం కూడా ధృవపత్రాల పరిశీలన పూర్తికాలేదు. ఇటు నిధులు విడుదల కాక.. అటు కాలేజీ యాజమాన్యాల వత్తిడి తట్టుకోలేక విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు.
ఈ విద్యా సంవత్సరానికి 2250 రూపాయల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం. అయితే మంజూరు చేసింది మాత్రం 873 కోట్లే. అంటే మొత్తం విద్యార్థుల్లో ఇది 20 శాతమే. అవి కూడా సక్రమంగా చెల్లింపులు జరిగాయా అంటే అదీ లేదు. కేవలం 7.5 శాతం మేర 301 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల కావడం గమనార్హం.
విద్యార్థులపై వత్తిడి
ఫీజుల గురించి ఇప్పటివరకు ఆయా కాలేజీ యాజమాన్యాలు పట్టించుకోకపోయినా.. విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో దృష్టి సారించాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఊసెత్తకపోవడంతో తప్పనిపరిస్థితుల్లో విద్యార్థులపై వత్తిడి తెస్తున్నాయి. పరీక్షల సమయంలో ఎలాగు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను టెన్షన్ కు గురిచేస్తాయనే ఉద్దేశంతో అకాడమిక్ ఇయర్ ముగిసేలోగా నిధులు విడుదల చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. గత రెండేళ్లకు సంబంధించిన బకాయిలు కూడా పెండింగ్ లో ఉండటం గమనార్హం.
బీసీ విద్యార్థులవే అధికం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రీయింబర్స్మెంట్ నిధుల్లో అగ్రభాగం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై కొద్ది భారమే పడుతోంది. అదే బీసీల విషయానికొస్తే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. అయితే తెలంగాణలో సగానికి పైగా విద్యార్థులు బీసీలే ఉండటంతో నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందనేది ఒక అంచనా.
2015-16 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి 6 కోట్ల రూపాయలు.. 2016-17లో 81 కోట్లు.. 2017-18లో 145 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం. అందులో 127 కోట్లు బీసీ విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. 2018-19 విద్యా సంవత్సరానికి కూడా 271 కోట్ల బడ్జెట్ బీసీ సంక్షేమ శాఖ ద్వారా విడుదల కావాల్సి ఉంది. అదలావుంటే ఫిబ్రవరి నెలాఖరు వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన ఆలస్యమైనట్లు సమాచారం. మొత్తానికి అటు ప్రభుత్వం తీరు.. ఇటు కాలేజీ యాజమాన్యాల వత్తిడి విద్యార్థుల పాలిట శాపంగా మారింది.