ఆర్టీసీకేనా ఆర్ధిక సూత్రాలు .. లోటు బడ్జెట్ లో ఉన్న ఆర్ధిక శాఖనూ ప్రైవేటీకరణ చెయ్యండన్న విజయశాంతి
ఆర్టీసీ సమ్మె విషయంలో ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఆర్టీసీని ప్రైవేటుపరం చెయ్యటానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదని, ఆర్థిక శాఖను కూడా ప్రైవేటు పరం చేయాలని విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు.
కేసీఆర్! మీ జాతకాలు తారుమారుకాక తప్పదు: విజయశాంతి సెటైర్లు
ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ కు రాములమ్మ చురకలు
కేసీఆర్ చెబుతున్న ఆర్థిక క్రమశిక్షణ కేవలం ఆర్టీసీకి మాత్రమే పరిమితం కాదని ఆమె పేర్కొన్నారు. అన్ని శాఖలకూ , ప్రభుత్వ పాలనకూ వర్తిస్తుందని పేర్కొన్నారు విజయశాంతి. ఇటీవల హైకోర్టులో ఆర్టీసీ సమ్మె విషయంలో జరిగిన వాదనల నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసిందని, హైకోర్టు వేసిన గూగ్లీ తో సీఎం కేసీఆర్ బండారం బయటపడిందని వ్యాఖ్యలు చేసిన విజయశాంతి ఇప్పుడు మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ ది కొత్త నాటకం
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, అందుకోసం కొత్త నాటకం నడుపుతున్నారని ఆమె ఆరోపించారు.నష్టాల్లో ఉన్న రూట్లను ప్రైవేటు ట్రావెల్స్ కు అప్పగిస్తానని, దానిద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తానని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న సీఎం కేసీఆర్ ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తం .. ఆర్ధిక శాఖను ప్రైవేట్ మయం చెయ్యండని ఆగ్రహం
ఇక అంతే కాదు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. ఇక ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక శాఖను సైతం ప్రైవేటు పరం చేయాలని విజయశాంతి చురకలంటించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారైందన్న విజయశాంతి, మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కారణం అని పేర్కొన్నారు.
ఆర్టీసీకేనా ఆర్ధిక సూత్రాలు.. మీకు వర్తించవా అని విజయశాంతి సూటి ప్రశ్న
ఇక మీకు వర్తించని ఆర్థిక సూత్రాలు, ఆర్టీసీకి వర్తించాలి అనుకోవడం దొరల నిరంకుశత్వానికి నిదర్శనమని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్టీసీ దెబ్బ తిన్నదని చెప్తున్న కెసిఆర్ ను , టిఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తినలేదా అని ప్రశ్నించారు విజయశాంతి.ఏదేమైనా ఆర్టీసీ నష్టాలకు కార్మికుల తీరు కారణమంటూ వేలెత్తి చూపిన సీఎం కేసీఆర్ కు రాములమ్మ గట్టిగానే చురకలంటించారు. ఆ నష్టాలకు కారణం వాళ్ళని కేసీఆర్ అంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత కష్టాలకు కారణం మీరు కాదా అంటూ సూటిగానే ప్రశ్నించారు విజయశాంతి.