షైన్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం .. ఒక పసికందు మృతి, 5గురు చిన్నారుల పరిస్థితి విషమం
ఎల్బీనగర్లో ఉన్న షైన్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. దీంతో ఆ పొగకు ఊపిరి ఆడక ఓ చిన్నారి మరణించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎల్బీనగర్ చౌరస్తా ఇక 'బంద్': రేపటి నుంచి యూటర్న్ తప్పదు..
షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం .. చిన్నారి మృతి
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా షైన్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతోనే ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన నాల్గవ అంతస్తులో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆరుగురు పిల్లలు వివిధ వ్యాధుల చికిత్సలో ఉన్నారు. అది గమనించిన సిబ్బంది అద్దాలు పగలగొట్టి మంటలార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు బాగా వ్యాపించడంతో పాటుగా అక్కడ అంతా పొగ కమ్మేసింది . దీంతో ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. కాగా, పలువురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
ఐదుగురికి తీవ్ర గాయాలు .. వేరే ఆస్పత్రుల్లో చికిత్స
గాయాలపాలైన వారిని సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగటంతో అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు ఆస్పత్రి అద్దాలు పగలగొట్టి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ఉన్న ఈ ఆస్పత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రామాదంపై పోలీసులు, ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రి సీజ్ .. ఎండీపై కేసు నమోదు
ఆస్పత్రిని మూసివేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ పై తనిఖీలు చేస్తున్నారు.ఆస్పత్రి దగ్గర చిన్నారుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ పై 304ఏ కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ ఆస్పత్రిలో చిన్నారుల ప్రాణాలతో ఆస్పత్రి యాజమాన్యం చెలగాటం ఆడిందని గుర్తించారు.
ఫైర్ సేఫ్టీ లేకనే ఘోరం .. ఆస్పత్రి ముందు బాధితుల ఆందోళన
ఏడాదిగా ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని రెన్యువల్ చేయించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తోందని పోలీసులు గుర్తించారు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఆస్పత్రుల్లో కూడా ప్రాణాలకు సేఫ్టీ లేకపోవటంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలకు లక్షలు ఆస్పత్రి ఫీజులు వసూలు చేస్తున్నా భద్రత పట్టింపు లేని ఆస్పత్రులను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు.