నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో పరుగు తీసిన సందర్శకులు
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అప్పటికే ఎగ్జిబిషన్ మైదానంలో సందర్శకులు కిక్కిరిసిపోయారు. మంటలు ఎగిసిపడటంతో సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు తరలి వచ్చారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చింది.
సంఘటన స్థలానికి నాలుగు ఫైరింజన్లు వచ్చాయి. మంటలను అదుపు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో.. రాత్రి సమయంలో మంటలు రావడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా కొంచెం తొక్కిసలాట జరిగింది.
ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ అయిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. పది స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం విషయం తెలియగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సంఘటన స్థలికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో నాంపల్లి - అసెంబ్లీ రోడ్డును మూసివేశారు. అగ్ని ప్రమాద స్టాల్స్ బాధితులు భారీగా నష్టపోయారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.
మంటలు అదుపులోకి వచ్చాయి: ఈటెల
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చెలరేగిన మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రమాదంలో కొందరికి గాయాలైతే ఆస్పత్రికి తరలించామన్నారు. దాదాపు పద్దెనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపుచేశామన్నారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో మంటలను అదుపులోకి వచ్చాయని చెప్పారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని, దుకాణదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.