సెక్రటేరియట్లో మళ్లీ ఫైర్ యాక్సిడెంట్.. వరుస అగ్ని ప్రమాదాలకు కారణమేంటో?
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు.. నిత్యం వచ్చిపోయే సందర్శకులతో కిటకిటలాడే సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్లు భయం పుట్టిస్తున్నాయి. పదుల సంఖ్యలో భవనాలు.. వేల సంఖ్యలో జనాలు.. అనుకోని ప్రమాదం జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించడం కష్టమే. తాజాగా ఐటీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మా డాటా చోరీ చేసి మాకే ఫోన్లా?.. వాళ్ల ప్లాన్ తిప్పికొట్టాలన్న చంద్రబాబు
స్వల్ప ప్రమాదమే..!
తెలంగాణ సచివాలయం.. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ సమీపాన ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం సహా మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు ఇందులో ఉన్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి పనుల మీదనో, వ్యక్తిగత పనుల మీదనో నిత్యం వేలాది మంది సచివాలయానికి వస్తుంటారు. అయితే సచివాలయంలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి.
తాజాగా డీ బ్లాక్ లోని మొదటి అంతస్థులో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఏసీ కోసం బయట ఏర్పాటు చేసిన ఫ్యాన్ నుంచి పొగలు రావడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫైర్ సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది. చిన్నపాటి ప్రమాదం కావడంతో మంటలు తొందరగానే అదుపులోకి వచ్చాయి.
గతంలోనూ ఇలాగే
సచివాలయంలో అగ్ని ప్రమాదాలు జరగడం ఇదేమీ కొత్త కాదు. తరచుగా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. 2018 మే మొదటివారంలో కూడా సీ బ్లాక్ లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పినట్లైంది.
2017 ఏప్రిల్ మొదటివారంలోనూ డీ బ్లాక్ లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ నుంచి మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బంది అలర్టయ్యారు. అప్పుడు కూడా పెను ప్రమాదం తప్పింది. వేసవికాలం కావడంతోనే నిరంతరాయంగా ఏసీలపై వర్క్ లోడ్ పడటంతో అగ్ని ప్రమాదం జరిగిందని అప్పుడు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఫైర్ యాక్సిడెంట్లతో ఉద్యోగుల్లో ఆందోళన
2016, ఫిబ్రవరి చివరి వారంలోనూ డీ బ్లాక్ మొదటి అంతస్తులోని 271 నెంబర్ గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంప్యూటర్లు వేడేక్కడంతో వైర్లు కాలిపోయానేది అప్పటి వెర్షన్. అలర్టైన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోవడంతో మంటలు తొందరగానే అదుపులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఉద్యోగులు పరుగులు పెట్టడంతో కొద్దిసేపు ఆందోళన వాతావరణం ఏర్పడింది.
చిన్నపాటి నిర్లక్ష్యం.. ప్రమాదాలకు హేతువు
ఇక 2014 ఏప్రిల్ చివరి వారంలో జరిగిన అగ్ని ప్రమాదం సచివాలయం భద్రతపై అనుమానాలు రేకెత్తించింది. సరిగ్గా తెలంగాణ రాష్ట్రం సిద్ధించే చివరిక్షణాలు అవి. అత్యంత రహస్య విభాగమైన SCD (Strictly Confidential Department) లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం కలకలం రేపింది. సీ బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఈ విభాగంలో పాత ఫైళ్లు స్టోర్ చేస్తారు. ఉద్యోగులు అందరూ వెళ్లిపోయాక, గేట్లకు తాళాలు పడ్డాక రాత్రి 8 గంటల సమయంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా వ్యాపించడంతో అలర్టైన సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు, ఫైర్ సిబ్బదికి సమాచారం అందించారు. మంటలు ఆర్పేంత లోపే SCD విభాగానికి చెందిన గది మొత్తం కాలిపోయింది.
షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు భావించినా.. అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అగ్నిప్రమాదంపై న్యాయవిచారణ జరపాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దరిమిలా కీలకమైన ఫైల్స్ తగులబెట్టే కుట్ర జరుగుతోందనే వాదనలు వినిపించాయి.
సచివాలయంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నిశితంగా పరిశీలిస్తే.. దాదాపు అన్ని వేసవికాలంలోనే జరుగుతుండటం గమనార్హం. మండుటెండలకు తోడు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరికరాలపై వర్క్ లోడ్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా సంబంధిత శాఖలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణం కావొచ్చు. ఇప్పటికైనా సెక్రటేరియట్ బాధ్యులు ముందుచూపుతో వ్యవహరిస్తారో లేదో చూడాలి.