స్కూల్ బిల్డింగ్లో ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ వల్లే..?
హైదరాబాద్ నడిబొడ్డున ప్రమాదం జరిగింది. బోయిన్ పల్లిలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం పొగలు రావడంతో ఆందోళన నెలకొంది. డైమండ్ పాయింట్ వద్ద గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
ప్రమాదంతో స్కూల్ ఆఫీసు రూమ్ దాదాపు మొత్తం కాలిపోయింది. అయితే ఆ సమయంలో స్కూల్ లోపల కొందరు సెక్యూరిటీ గార్డులు, అడ్మిన్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. స్కూల్స్ తెరిచేందుకు అనుమతి లేకపోవడంతో.. విద్యార్థులు ఆన్ లైన్ క్లాస్ వింటోన్న సంగతి తెలిసిందే. అయితే అడ్మిన్ సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందనిత తెలుస్తోంది.
కానీ స్కూల్లో ప్రమాదం మాత్రం కాస్త కలవరానికి గురిచేసింది. వైరస్ విజృంభించడంతో విద్యార్థులు లేరు. లేదంటే ప్రమాదాన్ని బట్టి.. విద్యార్థులపై ప్రభావం చూపేది. ప్రైవేట్ స్కూల్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతోన్నా.. అప్పుడప్పుడు మాత్రం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.