పదో తరగతి విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్: వీడియోలు తీసి బెదిరింపు...హయత్ నగర్లో దారుణం!!
అత్యాచారాలు... తరాలు మారినా, మానవ మేధస్సు ఎంత పెరిగినా, ఎన్ని సాధించినా.. ఏమి చేసినా సభ్యతను మరచిన సామాజిక పోకడలకు దర్పణంగా నిలుస్తాయి. దిగజారిపోతున్న మానవ విలువలకు అద్దంపడుతూ కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతమంది నేరస్తులకు జీవిత ఖైదులు, మరణ శిక్షలు విధించినా, అవేవి పట్టించుకోకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా నిత్యం అనేక చోట్ల చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. లైంగిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నారు. మైనర్లు, మేజర్లు, ముసలివారు అన్న తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుల సంఖ్య కూడా అలాగే పెరుగుతూ ఉంది. అత్యాచారం జరగని రోజు లేదు అన్న చందంగా పరిస్థితి ఉంది. తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఓ సామూహిక అత్యాచార ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది.
హయత్ నగర్ మండలం లోని తట్టి అన్నారం లో ఒక టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థినిపై సహచర విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. విద్యార్థినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. తట్టి అన్నారం లోని వైఎస్ఆర్ కాలనీ లో నివాసముండే టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అదే స్కూల్ లో చదువుకునే ఐదుగురు సహచర విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వారు అత్యాచారం చేసే సమయంలో వీడియోలను రికార్డ్ చేశారు. అంతేకాదు వారంతా ఆ వీడియోలను షేర్ చేసుకున్నారు.
ఇక ఈ విషయం పొరపాటున ఎవరికైనా బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని ఆ ఐదుగురు విద్యార్థులు బాధిత విద్యార్థినిని బెదిరించారు. వారంతా మైనర్ లే అయినప్పటికీ వారు చేసిన పని అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే వారి వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత విద్యార్థిని తనపై జరిగిన దారుణాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.