గ్రేటర్ పోలింగ్: ఐదుగురు ఐపీఎస్లకు బాధ్యతలు, ఉత్తర్వులు జారీచేసిన సీపీ
గ్రేటర్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఇక వాటిని స్క్రూటినీ చేయడమే మిగిలి ఉంది. అయితే ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలీసు యంత్రాంగం కూడా పటిష్ట చర్యలు తీసుకుంది. ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేందుకు ఐదుగురు ఐపీఎస్లకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల పరిశీలన అధికారులుగా ఐదుగురు ఐపీఎస్ అధికారులను నియమించారు. ఈస్ట్ జోన్ పరిశీలన అధికారిగా షికా గోయల్, వెస్ట్ జోన్ అధికారిగా అనిల్ కుమార్, సెంట్రల్ జోన్ తరుణ్ జోషి, నార్త్ జోన్ అవినాష్ మొహంతి, సౌత్ జౌన్కు చౌహాన్ను నియమించారు. ఆయా చోట్ల శాంతి భద్రతలు, ఎన్నికల నిర్వహణను వీరు పర్యవేక్షిస్తారు.
డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. రీ పోలింగ్ అవసరమైతే 3వ తేదీన నిర్వహిస్తారు. ఈ నెల 29వ తేదీన ఎన్నికల ప్రచారం ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. ప్రచారం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఐదుగురు అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారు.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మధ్యలో కాంగ్రెస్, మజ్లీస్ కూడా తమ వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు మాత్రం ప్రచార బరిలో దూసుకెళ్తున్నాయి.