ఐదుసార్లు ఎమ్మెల్యే.. హైదరాబాద్లో 5 రూపాయల భోజనం.. సింపుల్ మ్యాన్
హైదరాబాద్ : ప్రజాప్రతినిధి అంటే సకల సౌకర్యాలు, మందీ మార్బలం.. వేరే చెప్పనక్కర్లేదు ఆ రాజసం. ఇక ఎమ్మెల్యే అంటే మాటలా. రాజభోగాలకు తక్కువేమీ ఉండదు వారి వైభోగం. అయితే ఒక ఎమ్మెల్యే మాత్రం సాధారణంగా ఉంటారు. అతి సాధారణంగా జీవిస్తారు. కామన్ మ్యాన్ను మించిపోయి కనిపిస్తారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ఎవరూ నమ్మరు కూడా. అంతలా సింపుల్గా ఉండే ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హైదరాబాద్లో ఐదు రూపాయల భోజనం చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
ఐదుసార్లు ఎమ్మెల్యే.. సాదాసీదా జీవితం
ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే రూపురేఖలు, జీవన విధానం మారిపోతుంది. అలాంటిది గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన కామన్ మ్యాన్లాగే ఉంటారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచే గుమ్మడి నర్సయ్య మంగళవారం నాడు హైదరాబాద్ వచ్చారు. ఆ క్రమంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ దగ్గర జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయలకే భోజనం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో మళ్లీ ఆ ట్రెండ్.. దిష్టిబొమ్మల దహనంతో నిరసన.. ఈసారి కేసీఆర్ వంతు..! (వీడియో)
ఇప్పటికీ సైకిల్పైనే తిరుగుతూ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు గుమ్మడి నర్సయ్య. 1983, 1985, 1989, 1999, 2004లో శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఎమ్మెల్యేగా అన్నిసార్లు గెలుపొందినప్పటికీ ఆయనలో ఏనాడు కూడా అహంభావం కనిపించలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా.. ఇప్పుడైనా.. సైకిల్పైనే తిరుగుతారు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. అదే ఆయన స్పెషాలిటీ.
నిరాడంబరంగా ఉంటూ పేద ప్రజల మనిషిగా ముద్రపడ్డ గుమ్మడి నర్సయ్య హైదరాబాద్కు పని నిమిత్తం వచ్చి జీహెచ్ఎంసీ పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తినడం ఆసక్తికరంగా మారింది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా ఇలాగే ఉండాలనుకునే గుమ్మడి నర్సయ్యను చూసి నేటి రాజకీయ నాయకులు కొందరు మారినా సంతోషమే కదా.
కారు లేదు.. ఖరీదైన బంగ్లా లేదు.. సింపుల్ మ్యాన్
ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచారు. కానీ కారు లేదు, ఖరీదైన బంగ్లా లేదు. నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్లాలంటే ఆర్టీసీ బస్లో వెళ్లేవారు. వివిధ పనుల నిమిత్తం హైద్రాబాద్ లో తిరగాలంటే సిటీ బస్సులతో పాటు ఆటోలను ఆశ్రయించేవారు. ఒక రకంగా చెప్పాలంటే లగ్జరీ లైఫ్కు ఆయన దూరం. ఆయన ముగ్గురు పిల్లలను ప్రైవేట్ స్కూళ్లల్లో చదివించలేదు. గవర్నమెంట్ స్కూళ్లకే పంపారు.
ఆ కాలంలో నక్సల్స్ ప్రాబల్యమున్నప్పటికీ గన్మెన్లను తిరస్కరించిన గొప్ప నాయకుడు గుమ్మడి నర్సయ్య. అప్పట్లో ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వం కేటాయిస్తే వద్దని చెప్పి వారించిన గ్రేట్ లీడర్ ఆయన. ఆయనకు ఎమ్మెల్యే భృతి కింద వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీని నడిపించడానికి ఇచ్చారనే టాక్ ఉంది. అదలావుంటే ఇప్పటికీ కూడా ఆయన వ్యవసాయంపైనే ఆధారపడుతూ జీవనం సాగిస్తుండటం విశేషం.
అవినీత మరకలేని గొప్ప నాయకుడు
నియోజకవర్గాల పునర్విభజనతో రెండుసార్లు ఓటమి చెందారు. అయినా కూడా జనం మధ్యలోనే ఉన్నారు. ఓడిపోతే కొందరు పార్టీలు మారుతుంటారు. కానీ గుమ్మడి నర్సయ్య ఎప్పుడూ అలా చేయలేదు. తాను నమ్మిన సిద్దాంతాల కోసం పనిచేస్తూ ముందుకు కదిలారు. అందుకే ఆయనంటే ప్రజల్లో ఒకింత అభిమానం కనిపిస్తుంది. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఏనాడు కూడా అవినీతిని దరిచేరనివ్వని గొప్ప నాయకుడు. అందుకే సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ ఆయన్ని గొప్పగా సన్మానించారు. అంతేకాదు ఆయనకు పాదాభివందనం కూడా చేయడం విశేషం.