అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?
విశ్వనగరం హైదరాబాద్ మరో కాళరాత్రిని చవిచూసింది. మూడు రోజులు తిరక్కుండానే వాన దంచికొట్టడం, చెరువులు, నది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో భయానక సంఘటనలు, భీతావాహ దృశ్యాలు కనిపించాయి. ఈనెల 15 భారీ వర్షాలు, వరదల్ని ఎదుర్కొన్న సిటీలో మరోసారి శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా వర్షం బీభత్సం సృష్టించింది. మొన్న బురదలో కూరుకుపోయిన వాహనాలల్ని ఇంకా బయటికి తీసేలోపే.. తాజాగా వందల కొద్దీ వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. తాజా వీడియోలు సంచలనంగా మారాయి. మరోవైపు వాతావరణ శాఖ, పోలీసులు కీలక ఆదేశాలు, హెచ్చరికలు చేశారు..
Recommended Video
హైదరాబాద్ మళ్లీ ఆగం: తాజా పరిస్థితి - జలదిగ్బంధం - ఇద్దరు మృతి - హైవేలు బంద్ - కూలిన గోల్కొండ గోడ
లోతట్టు ప్రాంతాల్లో భయానకం..
ఓల్డ్ సిటీలోని ఓ ముంపు ప్రాంతంలోకి భారీ గా వరద ఉప్పొంగడం, ఆ ప్రవాహంలో కార్లు, ఆటోలు కొట్టుకు పోతున్న దృశ్యాల తాలూకు వీడియోలు బయటికొచ్చాయి. వరదలో కొట్టుకుపోతోన్న తన కారును కాపాడేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం చేయగా.. పక్కనున్న వాళ్లు ‘‘అరే తాహిర్.. పిచ్చోడివా.. కారుతోపాటు కొట్టుకుపోతావ్.. బయటికొచ్చెయ్..'' అంటూ అరుస్తుండటం వీడియోలో కనిపించింది. మరో వీడియోలో.. వరదలో చిక్కుకుపోయిన కారును జేసీబీ సాయంతో కాపాడుతోన్న దృశ్యాలున్నాయి.
చెరువులకు గండ్లు..
గురువారం నాటికే ప్రమాదకర స్థాయిని దాటిన పలు చెరువులు.. శనివారం రాత్రి నాటి వర్షానికి పొంగిపొర్లడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. వందలకొద్దీ ప్రాంతాల్లో జనం.. ఇళ్లలో ఉంటే ఏమవుతుందోననే భయంతో డాబాల పైకి ఎక్కారు. చిన్నా, పెద్దా అందరూ ఇళ్లపైకి చేరి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పరిస్థితి భయానకంగా మారడంతో చెరువులు తెగకముందే.. అధికారుల వాటికి గండ్లు కొట్టారు. బాలానగర్, బాబానగర్ లోని గుర్రం చెరువులకు అధికారులు గండ్లు కొట్టడంతో.. ఆయా ముంపు ప్రాంతాలకు వరద పోటెత్తింది. పదుల సంఖ్యలో ఆటోలు, కార్లు కాగితం పడవల మాదిరిగా కొట్టుకుపోయాయి.
21 వరకు అప్రమత్తత..
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 వరకు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్పటివరకు పోలీసు సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు, ముందస్తు వ్యూహాలు సిద్ధం చేయాలని, క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సూచించారు.
వరుణుడు పగపట్టాడా?
గురువారం నాటి వర్షాలు, వరదల ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తడంతో జనం బెంబేలవుతున్నారు. వరుణదేవుడు పగపట్టినట్లుగా, శిక్షించినట్లుగా పరిస్థితి తయారైందని చర్చించుకుంటున్నారు. నాలుగు రోజులుగా అంధకారంలోనే ఉంటోన్న పలు ప్రాంతాల్లో ఇంకొన్ని రోజులూ కరెంటు ఇవ్వలేని పరిస్థితి. ఇటీవలి వర్షాలకు 50 మంది చనిపోగా, తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విపత్తు నిర్వహణ, జీహెచ్ఎంసీ, పోలీసు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి.