year ender 2020 : హైదరాబాద్ ను ముంచేసిన వరదలు ఓ చేదు జ్ఞాపకం .. అపార ఆస్తి, ప్రాణ నష్టం
2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్సరంలో మూసీ నదికి వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత 2020 వ సంవత్సరంలో ఊహించని విధంగా హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. భాగ్యనగర వాసులు వరదల కారణంగా నిరాశ్రయులై చిగురుటాకుల్లా వణికిపోయారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాదుతో పాటుగా తెలంగాణ రాష్ట్రమంతటా పలు జిల్లాలు నీటమునిగాయి. అయితే ముఖ్యంగా హైదరాబాద్లోనే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. అపార ఆస్తినష్టం జరిగింది .
year ender 2020 : ఒళ్ళు గగుర్పొడిచే క్రైం సినిమాలా వరంగల్ 9 హత్యల ఘటన .. మానవ మృగానికి మరణ శిక్ష
2020 వ సంవత్సరం అక్టోబరు నెలలో హైదరాబాద్ లో వరదలు
400 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక చరిత్ర కలిగిన దేశంలోనే అతి పెద్ద రెండవ మెట్రోపాలిటన్ నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఈ యేడాది వర్షం కారణంగా నీటమునిగింది. వేల సంఖ్యలో ఉన్న హైదరాబాద్లోని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి లేక తాగడానికి నీరు కూడా దొరకని ఇబ్బందికర పరిస్థితుల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు విలవిలలాడారు . 2020 వ సంవత్సరం అక్టోబరు నెలలో కురిసిన వర్షాలతో వేలాది కాలనీలు నీట మునగగా , ద్విచక్రవాహనాలు, కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. వరద ప్రవాహంలో మనుషులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, కొన్ని కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది.
వర్షాలు వరదల కారణంగా 98 మందికి పైగా మరణించినట్లు అంచనా
కుండపోతగా కురిసిన వర్షాలు వరదల ధాటికి చాలా చోట్ల పాత భవనాలు కుప్పకూలాయి .వర్షాలు వరదల కారణంగా 98 మందికి పైగా మరణించినట్లుగా అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది .సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు సహాయక సిబ్బంది సైన్యం కూడా రంగంలోకి దిగారు అంటే వరద ప్రభావం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా హైదరాబాద్ నగర వాసుల అవసరాలు తీరలేదు. దీంతో హైదరాబాదీలు తీవ్ర అసహనాన్నివ్యక్తం చేశారు .వరదల కారణంగా ఇబ్బంది పడిన కాలనీల ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
సహాయక చర్యలు అందక భగ్గుమన్న హైదరాబాదీలు ... మంత్రులు , ఎమ్మెల్యేలకు చుక్కలు
సహాయక చర్యలను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పోరేటర్ లను ప్రజలు నిలదీశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించినా , ప్రజలకు అందించే సహాయం మాత్రం అరకొరగానే ఉందని అసహనం వ్యక్తం చేశారు. 360 జాతీయ విపత్తు దళాలు , అలాగే భారత సైన్యం దళాలను రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిణా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది . హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు ఉపశమనం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మొత్తం 5 వేల కోట్లకు పైగా వరద నష్టం జరిగిందని కేంద్రానికి తెలిపారు.
5 వేల కోట్లకు పైగా నష్టం .. కేంద్ర సాయం కోరిన కేసీఆర్
రూ 1,350 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఒక లేఖ రాశారు. ఇందులో రైతులకు 600 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో వరద నష్టం మరియు పునరావాస పనులపై 750 కోట్లు ఇవ్వాలని కోరారు. అక్టోబర్ 14 న, తెలంగాణ ప్రభుత్వం వరదలు కారణంగా వరద సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది మినహా, మిగతా శాఖల వారికి రెండు రోజుల సెలవు ప్రకటించింది . ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని , ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరింది. తెలంగాణ ప్రభుత్వం వరదలతో నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సహాయం ప్రకటించింది . వరద ముంపుకు గురైన కుటుంబాలకు ఇంటికి పదివేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది .
వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం ప్రకటించిన తెలంగాణా సర్కార్
వరదల వల్ల ఇళ్ళు పూర్తిగా కూలిపోతే వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న 50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది . పేదలకు సహాయం చేయడం కోసం పురపాలకశాఖ 550 కోట్లు తక్షణమే విడుదల చేసినట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలపై కేంద్రం సైతం దృష్టిసారించింది. రాష్ట్రంలో వరద పరిస్థితులను స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపించారు.
స్పందించిన ఇతర రాష్ట్రాలు ,సినీ ప్రముఖులు ..భారీగా హైదరాబాద్ కు సాయం
ఇక తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం పళని స్వామి 10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 15 కోట్ల సహాయాన్ని హైదరాబాద్ కు ప్రకటించారు . పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. ఇలా ఉంటే సినీ ప్రముఖులు కూడా విరాళాలు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ 50 లక్షలు విరాళం ఇవ్వగా , ప్రభాస్ కోటి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ,కోటి రూపాయలు, అక్కినేని నాగార్జున 50 లక్షల రూపాయలు, రామ్ 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షల రూపాయలు వరద బాధితులకు విరాళంగా ప్రకటించారు.