మోదీ తీరు ‘ప్లేయింగ్ టు ది గ్యాలరీ’.. నిర్మల ప్రకటనపై టీఆర్ఎస్ ఫైర్.. టీ-బీపాస్పై కేటీఆర్ ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ వెలువరించిన రూ.20 లక్షల కోట్ల బాహుబలి ప్యాకేజీలో వలస కూలీలు, పేదలకు జరిగే మేలులను వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ నిర్మల ప్యాకేజీలు నిరుత్సాహపర్చాయన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనలోని అంశాలన్నీ గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉన్నాయని, అందులో ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగకరంగా లేదని మాజీ ఎంపీ విమర్శించారు. ''వలస కూలీల కోసం రెంటల్ అకామీడేషన్ పేరుతో రూపొందించిన ప్లాన్ అమలు కావడానికి కనీసం 3ఏళ్లు పడుతుంది. నాబార్డు రీ ఫైనాన్స్ పేరుతో చేసిన ప్రకటనైతే కొత్త సీసాలో పాత సారా పోసినట్లుంది. అడవుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన కాంపా నిధులు వలస కూలీలకు ఏ మేరకు సాయం పడతాయో అర్థం కావడంలేదు. మొత్తంగా మోదీ సర్కారు వైఖరి ''ప్లేయింగ్ టు గ్యాలరీ(పబ్లిసిటీ కోసమే మాట్లాడటం)''లాగా ఉంది''అని వినోద్ కుమార్ అన్నారు. ఇదిలా ఉంటే,
టీఎస్ బీపాస్(టీఎస్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్)పై మంత్రి కేటీఆర్ గురువారం కీలక సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల్లోనూ జులై మొదటి వారం నుంచే టీఎస్ బీపాస్ విధానాన్ని అమలులోకి తేనున్నట్లు మంత్రి తెలిపారు. ఆ మేరకు అధికారగణం సిద్ధంగా ఉండాలని, కొత్త విధానంలో భాగస్వాములైన సిబ్బంది అందరికీ శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.