ప్రయాణికులకు విజ్ఞప్తి: రైల్లో ఆహారం తీసుకునే ముందు ఒకసారి సరిచూసుకోండి..లేదంటే...
మీరు సుదూరప్రాంతాలకు రైల్లో ప్రయాణిస్తున్నారా..? మధ్యలో ఆకలి వేస్తుంది కదా అని రైల్లో అమ్మే ఆహార పదార్థలు కొని తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని మీరు రిస్క్లో పెట్టినట్లే. ఎందుకంటే కొన్ని రైళ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ప్రయాణికులకు అందించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భారతీయ రైల్వేలో దర్శనమిచ్చింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సికిందరాబాద్ దురంతో ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు మురిగిపోయిన ఆహారాన్ని వడ్డించారు. బిస్కెట్లు, స్నాక్స్, టీబ్యాగులు అన్నీ ఎక్స్పైరీ డేట్ దాటేశాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
రైలు మీద నుంచి వెళ్లినా, చిన్న గాయం కాకుండా బయటపడిన చిన్నారి (వీడియో)
బిస్కెట్లు తిన్న ప్రయాణికులు రుచి వేరుగా ఉండటంతో రైల్లోని కేటరింగ్ సిబ్బంది దృష్టికి తీసుకొచ్చారు. వారి నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో రైల్లోని ఓ ప్రయాణికుడు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్సీటీసీ)కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దురంతో ఎక్స్ప్రెస్ దాదాపు 12 గంటల్లో 773 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. కేటరింగ్ సర్వీసుల కోసం ప్రయాణికులు అదనంగా డబ్బులు చెల్లిస్తారు. ముంబై లోకమాన్యతిలక్ టెర్మినస్ నుంచి బుధవారం రాత్రి 11గంటలకు దురంతో ట్రైన్ ఎక్కారు ప్రయాణికులు. అందులో చాలామంది భోజనం చేసే రైలు ఎక్కారు.
ఉదయం సమయంలో టిఫెన్కు బిస్కెట్లు టీ ఇచ్చారని ఓ ప్రయాణికుడు తెలిపాడు. అది రుచి వేరుగా రావడం... ఒక్కింత దుర్వాసన రావడంతో ఎక్స్పైరీ డేట్ చెక్ చేసినట్లు చెప్పాడు. బిస్కెట్లు జూన్లో మానుఫాక్చర్ కాగా.. నవంబర్లో ఎక్స్పైరీ డేట్ ఉందని.. అలాంటి బిస్కెట్లు తమకు ఇచ్చి కేటరింగ్ సిబ్బంది ప్రయాణికుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తాడు. తన ప్రయాణానికి రూ. 3690 చెల్లించినట్లు చెప్పిన ప్రయాణికుడు ఆహారం వడ్డించే ముందు కనీస విలువలు పాటించడంలో కేటరింగ్ సిబ్బంది విఫలమైందని వెల్లడించాడు. ఇదేమని సిబ్బందిని అడిగితే సికింద్రాబాదులో ఐఆర్సీటీసీ వద్ద ఫిర్యాదు చేయండంటూ సమాధానం ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు. దురంతోలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో పోస్టో చేయడంతో వైరల్ అయ్యింది.
దురంతో, రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించేలా పలు ప్రోత్సాహకాలు ఇస్తున్న భారతీయ రైల్వేలకు ఇలాంటి ఘటనలు తలనొప్పిగా మారాయి. దురంతో రైలులో చోటుచేసుకున్న ఘటన తమ దృష్టికి వచ్చిందని విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.