బోనమెత్తిన సికింద్రాబాద్... మహంకాళి దర్శనానికి బారులు తీరిన జనం..
సికింద్రాబాద్ : డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. బోనం సమర్పించేందుకు బారులు తీరారు. బోనాల పండుగను సజావుగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
తెల్లవారుజామున 4గంటల నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొదటి పూజ ప్రారంభించారు. తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావ్ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
బోనాల సందర్భంగా అమ్మవారికి సాక, ఫలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, బలిగంప, ఊరేగింపు తదితర ఘట్టాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. గతేడాది ఘటాల ఊరేగింపు నుంచి రంగం వరకు 20లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సారి ఆ సంఖ్య 25లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆది, సోమవారాల్లోనే కనీసం 5 లక్షలకుపైగా జనం దర్శనానికి వస్తారని భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత
బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. 2వేల మంది సిబ్బంది డేగ కళ్లతో పహరా కాస్తున్నారు. ప్రతి అంగుళాన్ని పరిశీలించేందుకు 200 సీసీటీవీకెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం 25 షీ టీమ్స్ రంగంలోకి దింపారు. సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. సోమవారం జరగనున్న రంగం వేడుకలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించనుంది.