విదేశాలకు వస్తువులు పంపడం ఇప్పుడు చాలా ఈజీ గురూ..!
హైదరాబాద్ : భాగ్యనగర వాసులకు శుభవార్త. విదేశాల్లో ఉండే కొడుకు, కూతుళ్లకు.. బంధుమిత్రులకు ఏవైనా వస్తువులు పంపాలంటే ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పడేవారు. కాదు, కూడదు ఎలాగైనా పంపాలనుకుంటే మాత్రం ప్రైవేట్ కొరియర్స్ మీద ఆధారపడేవారు. అయితే వాళ్లు వేసే ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటుండటంతో నగరవాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే అలాంటి కష్టాలకు ఇక మీదట చెక్ పడినట్లే అంటున్నారు పోస్టల్ అధికారులు. రెండు ప్రధాన పోస్టాఫీసుల నుంచి విదేశాలకు వస్తువులు పంపించే వెసులుబాటు దొరకనుంది.
విదేశాలకు వస్తువులు పంపాలా.. ఇప్పుడు చాలా ఈజీ..!
విదేశాల్లో ఉండే బంధు మిత్రులకు ఏవైనా వస్తువులు పంపించాలంటే హైదరాబాద్ వాసులు చాలా ఇబ్బందులు పడేవారు. చివరకు ప్రైవేట్ కొరియర్స్ను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్న సందర్భాలు అనేకం. 500 గ్రాముల పార్శిల్ పంపాలంటే కూడా వేలల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది. అయితే తాజాగా పోస్టల్ అధికారులు నగర వాసులకు ఊరట కల్పించేలా ఫారిన్ పోస్ట్ ఆఫీస్లు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇన్నాళ్లు పోస్ట్ ఆఫీసుల్లో కస్టమ్స్ డిపార్టుమెంట్ ప్రత్యేకంగా లేకపోవడంతో హోమియో, ఆయుర్వేదం లాంటి మందులతో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ విదేశాలకు పంపించడానికి అనుమతి లేదు. ఆ క్రమంలో కొన్ని రకాల వస్తువులతో పాటు దుస్తులు, పచ్చళ్లు, ఆహార పదార్థాలు తదితర వస్తువులు మాత్రమే విదేశాల్లోని బంధు మిత్రులకు పంపించేవారు. ఆ నేపథ్యంలో చాలామంది ప్రైవేట్ కొరియర్స్ను ఆశ్రయించేవారు. అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో వాళ్లు అడిగినంత ఇచ్చుకోవాల్సి వస్తోంది.
రెండు చోట్ల కస్టమ్స్ ప్రధాన కార్యాలయాలు.. తనిఖీలు ఇకపై ఇక్కడే..!
హైదరాబాద్లోని మెహిదీపట్నంతో పాటు మాసబ్ట్యాంక్ ఏరియాలోని హుమాయున్ నగర్ పోస్ట్ ఆఫీసులో కస్టమ్స్ ప్రధాన కార్యాలయాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దాంతో విదేశాలకు ఇకపై సరుకులు పంపడం సులభతరం కానుంది. ఇన్నాళ్లు ప్రైవేట్ కొరియర్స్పై ఆధారపడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించిన నగర వాసులు ఇకపై పోస్ట్ ఆఫీసుల నుంచి విదేశాల్లోని బంధు మిత్రులకు సరుకులు గానీ, వస్తువులు గానీ ఈజీగా పంపించుకోవచ్చు.
ఫారిన్ పోస్ట్ ఆఫీసులుగా పిలిచే ఈ తపాలా కార్యాలయాల నుంచి ఒక్కొక్కరు దాదాపు 30 కిలోల వరకు వస్తువులు గానీ, సరుకులు గానీ పంపించుకునే వీలుంది. అందులో చేపల్లాంటి జల జీవరాసులు కాకుండా.. నూనెలు పంపించకుండా కొన్ని నిబంధనలు పెట్టారు.
ఇన్నాళ్లు ఆ నాలుగు ప్రాంతాల్లోనే చెకింగ్.. ఇప్పుడు హైదరాబాద్లో కూడా..!
ఇదివరకు విదేశాలకు వస్తువులు పంపించాలంటే.. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా తదితర ప్రాంతాల్లోనే కస్టమ్స్ ప్రధాన కార్యాలయాలు ఉండేవి. దాంతో ఆయా ప్రాంతాల నుంచి మాత్రమే విదేశాలకు వస్తువులు పంపించే వెసులుబాటు ఉండేది. అంతేకాదు ఆ పోస్ట్ ఆఫీసుల నుంచే ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు నడిచేవి. అయితే విదేశాలకు వస్తువులు పంపించడం అనేది ఇదివరకు ప్రతి పోస్టాఫీసు నుంచి వెసులుబాటు ఉన్నా.. ఆ నాలుగు ప్రాంతాల్లో మాత్రమే కస్టమ్స్ డిపార్టుమెంట్స్ ఉండటంతో అక్కడ పార్శిళ్లకు సంబంధించి తనిఖీలు జరిగేవి. అలా కాస్తా ఆలస్యం జరిగేది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో రెండు చోట్ల కస్టమ్స్ డిపార్టుమెంట్ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో చెకింగ్ కాస్తా సులువుగా మారనుంది.
నగరవాసుల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు..!
హైదరాబాద్లో ఫారిన్ పోస్ట్ ఆఫీసుకు సంబంధించి కస్టమ్స్ డిపార్టుమెంట్స్ ఏర్పాటు చేయడంతో నగరవాసులు ప్యాక్ చేయకముందే హుమాయున్ నగర్లోని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయనున్నారు. దాని తర్వాత మళ్లీ వినియోగదారుడికి చేరేంత వరకు ఆ పార్శిల్ను ఎక్కడ విప్పరు, తనిఖీ చేయరు. అయితే విదేశాలకు వస్తువులు పంపించడానికి ప్రజల్లో అవగాహన పెంచే విధంగా కృషి చేస్తున్నారు పోస్టల్ అధికారులు.