చెట్లు నరికితే అంతే సంగతి.. హైదరాబాద్లో ఎంత జరిమానా వేశారో తెలుసా?
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా హరితహారం తీసుకొచ్చింది. ఆ క్రమంలో పల్లె పట్నం తేడా లేకుండా మొక్కల పెంపకం జోరందుకుంది. అంతేకాదు జంగల్ బచావో, జంగల్ బడావో అంటూ అడవుల సంరక్షణ కోసం సైతం నడుం బిగించింది కేసీఆర్ సర్కార్.
అయితే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చెట్ల సంరక్షణపై ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న వాహనాలు.. దానికి తోడు కాలుష్యం వెరసి భాగ్యనగర వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. ఆ క్రమంలో చెట్లను సంరక్షించడంతో పాటు మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకుంటోంది. ఆ క్రమంలో హైదరాబాద్లో చెట్లు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయనే ఆందోళన నేపథ్యంలో అధికారులు కఠిన చట్టాలు అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ టు బీజేపీ వయా టీఆర్ఎస్.. వివేకానందుడి మంత్రం ఈసారైనా..!
హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనతో అటవీశాఖ అధికారులు ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతోంది. ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారుల అనుమతి లేకుండా చెట్లు కొట్టేయించిన ఓ పెద్దాయనకు భారీ జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో నివాసముండే సదరు వ్యక్తి ఇటీవల మూడు చెట్లను నరికించారు. అది కాస్తా అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో 39 వేల 60 రూపాయలు పెనాల్టీ వేశారు.
బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదుట భారీ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న మూడు చెట్లు తమ భవన నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని భావించి దాని యజమాని వాటిని కొట్టేయించారు. దాంతో పచ్చని చెట్లను అనవసరంగా నరికేశారంటూ ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులకు కంప్లైంట్స్ వచ్చాయి. రంగంలోకి దిగిన అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. చెట్లను నరికివేసినట్లు రుజువు కావడంతో జులై నెల మొదటి వారంలో జరిమానా వేశారు. ఆ మేరకు నెల రోజులు నోటీస్ పీరియడ్ ఇవ్వడంతో సదరు భవన యజమాని ఈ నెల 9వ తేదీన 39 వేల 60 రూపాయల పెనాల్టీ కట్టేశారు.