పాత మ్యానిఫెస్టోనే మళ్ళీ కొత్తగా ... టీఆర్ఎస్ కు 20 సీట్లు కూడా కష్టమే : మాజీ ఎంపీ వివేక్
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో నేతలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేతలు మాటల తూటాలను ఎక్కుపెడుతున్నారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి టిఆర్ఎస్ పార్టీ మీద విరుచుకు పడ్డారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీకి కనీసం 20 సీట్లు కూడా రావని తేలిపోయిందని ఆయన జోస్యం చెప్పారు.
రెండు రాష్ట్రాల్లోనూ పాలన ఒకటే: సీఎం కేసీఆర్, సీఎం జగన్ లపై బాబుమోహన్ ఫైర్
టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ఫెయిల్ అని పేర్కొన్న వివేక్ వెంకటస్వామి పాత మేనిఫెస్టోనే మళ్లీ కొత్తగా తెరమీదకు తీసుకువచ్చారు అంటూ విమర్శించారు. కొద్దిగా మార్పులు చేర్పులతో పాత మ్యానిఫెస్టో మళ్లీ రూపొందించారని, ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మడం లేదని పేర్కొన్నారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోకు ప్రజల నుంచి రెస్పాన్స్ రావడం లేదని చెప్పిన ఆయన టిఆర్ఎస్ సర్కార్ బిజెపి నాయకులను కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ కావాలని విద్వేషాలను సృష్టిస్తున్నారని, బిజెపి ఎక్కడ మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, ఇది టిఆర్ఎస్ పార్టీ కావాలని సృష్టిస్తున్న అలజడి అంటూ వ్యాఖ్యానించారు వివేక్ వెంకటస్వామి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మత విద్వేషాలు చోటుచేసుకున్నాయా ... మీకు కనిపించడం లేదా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని కేటీఆర్ కు చెప్పారు . టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి పార్లమెంటు స్థానాల్లోనూ , దుబ్బాక ఉప ఎన్నికలలో ఓడిపోయారు . ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ ఓడిపోబోతున్నారు అంటూ వివేక్ వెంకటస్వామి టిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. జియాగూడలో బిజెపి అభ్యర్థి దర్శన్ తరఫున ప్రచారం నిర్వహించిన క్రమంలో వివేక్ వెంకటస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.