కిడ్నీ బాధితులకు ఆర్టీసీ ఊరట.. ఇక ఉచిత ప్రయాణమే..! అటెండెంట్ లకు కూడా ఇస్తే..!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితులకు ఊరట కలిగిస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆ మేరకు ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్శర్మ ప్రకటన జారీ చేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే కిడ్నీ బాధితులకు కొంత మేర ప్రయోజనం చేకూరనుంది. తాజాగా మరుగుజ్జులకు 50 శాతం రాయితీ కల్పించారు. ఆ క్రమంలో కిడ్నీ బాధితుల బాధలను అర్థం చేసుకున్న ఆర్టీసీ.. ఫ్రీ జర్నీకి అవకాశం కల్పించింది.
ఊరట.. కొంతలో కొంత
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు డయాలసిస్ చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఆర్థికంగా వెనుకబడ్డవారి కష్టాలు వర్ణనాతీతం. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ ఉచితంగా అందుతున్నా.. మెడిసిన్, ఫుడ్, రవాణా తదితర ఖర్చులు వారికి అదనపు భారంగా పరిణమిస్తున్నాయి. గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో ఉండేవారు.. డయాలసిస్ కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది.
నో టికెట్.. ఫ్రీ జర్నీ
కిడ్నీ ఫెయిల్యూరయి డయాలసిస్ సేవలు అవసరమవుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కిడ్నీ సమస్యలకు కారణమవుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ రెండు మూడేళ్లలో కిడ్నీ బాధితుల సంఖ్య వీపరీతంగా పెరిగిపోయింది. కొందరికి వారంలో రెండు, మూడు డయాలిసిస్ సేవలు అవసరమవుతున్న క్రమంలో ఇతరత్రా ఖర్చులతో పాటు రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ బాధితులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం హర్షణీయం.
అన్ని డిపోలకు ఉత్తర్వులు
కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనికోసం బస్సు పాసులు అందిస్తామన్నారు ఇన్ఛార్జి ఎండీ సునీల్శర్మ. ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద డయాలసిస్ చేసుకునే దాదాపు 7,600 మందికి.. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఎక్స్ప్రెస్, పల్లెవెలుగుతో పాటు హైదరాబాద్, వరంగల్ లో సిటీ బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామన్నారు. దీని ద్వారా ఆర్టీసీపై పడే 12.22 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. రీయింబర్స్ మెంట్ ద్వారా ఆర్టీసీకి చెల్లించనున్నట్లు చెప్పారు. కిడ్నీ బాధితులకు ఉచిత ప్రయాణం కల్పించే విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు.
అటెండెంట్ లకు కూడా ఇస్తే బాగుండు..!
కిడ్నీ బాధితులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కిడ్నీ బాధితుల వెంట వెళ్లే అటెండెంట్ లకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డయాలసిస్ తర్వాత కిడ్నీ బాధితులు నీరసంగా మారతారు. దీంతో వారి వెంబడి ఒక అటెండెంట్ కూడా ఉండాల్సిన పరిస్థితి. కిడ్నీ బాధిత పెషేంట్లకు ఫ్రీ జర్నీ అవకాశం ఇచ్చినా.. అటెండెంట్స్ ఛార్జీలు పెట్టుకుని వెళ్లాల్సిందే కదా అనే వాదన వినిపిస్తోంది.