ఇకపై బస్ స్టాండ్ లలో ఫ్రీ వైఫై .. బీఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ
ప్రపంచీకరణ నేపథ్యంలో మన జీవితాలు ఇంటర్నెట్ తో ముడిపడి పోయాయి. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా , మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించాలన్నా , ఉద్యోగ వ్యాపారాలు చెయ్యాలన్నా అన్నిటికి ఇంటర్నెట్ అవసరమవుతుంది. ప్రజలకు ఉన్న ఇంటర్నెట్ అవసరాన్ని గుర్తించిన ఆర్టీసీ స్టేషన్లలోనూ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీ తన ఐటీసేవలను త్వరలో ప్రారంభించనుంది .
ఇప్పటికే రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. ఇక బస్టాండ్ లలో సైతం ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. దీనికోసం బిఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతోంది ఆర్టీసీ. ప్రయోగాత్మకంగా 8 స్టేషన్లలో అందించాలని చూస్తోంది. తొలుత ఈసీఐఎల్, దిల్ సుఖ్ నగర్, పటాన్ చెరువు వంటి 8 బస్ స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 358 బస్సు స్టాండ్ లలోనూ, హైదరాబాద్ వరంగల్ వంటి మహానగరాల్లో 1124 బస్ షెల్టర్లు ఉండగా వాటిలో ప్రయాణికుల రద్దీని ప్రామాణికంగా తీసుకొని ప్రధానమైన స్టేషన్లలో ఈ వైఫై సేవలను అందించాలని నిర్ణయించుకుంది టి ఎస్ ఆర్ టి సి. ప్రస్తుతం ఈ విషయంలో బిఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఐటీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.