గచ్చిబౌలి టిమ్స్ టీ సర్కార్ కు ఓ ప్రచార సాధనం మాత్రమే.!ఆకస్మిక తనిఖీ చేసి మండిపడ్డ రేవంత్ రెడ్డి.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఏమేరకు మభ్యపెడుతుందో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రే పెద్ద ఉదాహరణ అని మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వ బండారాన్ని కూడా బట్టబయలు చేశారు. సరిగ్గా 80 రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఓ సంచలన ప్రకటన చేశారని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అన్ని హంగులతో ఒక్కో ఆస్పత్రిని నిర్మించుకుందామన్న ప్రకటనను రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని ఘనంగా ప్రకటించి ఏప్రిల్ లో ప్రారంభం కూడా చేశారని, చేసిన తర్వాత ఒక్క రోగికి కూడా అందులో చికిత్స అందడం లేదని అన్నారు.
గచ్చిబౌలిలో టిమ్స్ పేరుతో హడావిడి.. తెలంగాణ సర్కార్ చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డి..
పది వేల కేసులు వచ్చినా డీల్ చేయగలిగిన స్థితిలో ప్రభుత్వం ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం అస్సలే లేదని సీఎం చంద్రశేఖర్ రావు గొప్పగా ప్రకటించారని, రోగుల కోసం అంతా సిద్ధం చేసినట్లు కవరింగ్ ఇచ్చారని, కట్ చేస్తే కొద్ది రోజుల క్రితం, గాంధీలో పేషెంట్లు నిండిపోవడంతో నిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చమని ఆదేశాలు వచ్చాయని, అయితే టిమ్స్ ఏమైందని చాలామందిలో సందేహాలు కలిగాయని రేంవంత్ రెడ్డి గుర్తు చేసారు. ఏ ఒక్క మీడియా కూడా ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావిచలేదని రేవంత్ తెలిపారు. ఆదివారం రేవంత్ రెడ్డి దానిని ఆకస్మికంగా పర్యటించగా ఆశ్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.
గచ్చిబౌలి కోవిడ్ ఆసుపత్రిలో కుక్కలు తిరుగుతున్నాయి.. ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన రేవంత్..
టిమ్స్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక వీడియో విడుదల చేసారు. అంతే కాకుండా గచ్చిబౌలి టిమ్స్ గురించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్కడ ఎటువంటి ఆస్పత్రి సదుపాయాలు లేవు. నలుగురు సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. ఇదీ మన ముఖ్యమంత్రి మాటల గారడీ, ఆయన గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు. టిమ్స్ గురించి అంత గొప్పగా చెప్పాడు? చివరకు ఏమైంది.. ఏమీ లేదు. నిమ్స్ మీద ఆధారపడ్డారు. అంత ఘనంగా ప్రచారం చేసుకుని మీడియాలో రాయించుకున్నాడని, ఇక్కడ కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి తప్పతే పేషెంట్లు లేరని రేవంత్ రెడ్డి విచారాన్ని వ్యక్తం చేసారు.
Recommended Video
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది.. కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదన్న ఎంపీ..
చంద్రశేఖర్ రావు అంత గొప్పగా చెప్పిన ఈ ఆస్పత్రికి డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదని అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టిమ్స్ భవనం డ్రైనేజీ నీరు హైదరాబాదు విశ్వవిద్యాలయంలోకి పారుతున్నాయని, అది తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న చర్యలని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు. చంద్రశేఖర్ రావు మీడియా సమావేశం ఏర్పాటుచేసి తన మాటల గారడీ ప్రదర్శించడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ ఉండదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కరోనా పట్ల ప్రభుత్వం చేతులెత్తేసింది.. అందుకే కేసులు పెరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి..
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోందని, సరైన టెస్టులు చేసి కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అండగా నిలవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. కొన్ని సార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అదే జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేసేందుకు ఉపక్రమిస్తంటే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు సీఎం చంద్రశేఖర్ రావు పై విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వ డొల్లతనాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.