మార్చురీలో కళ్లు తెరిచిన యువకుడు.. అద్భుతం కాదు, గాంధీ ఆసుపత్రి నిర్లక్ష్యం
హైదరాబాద్ : పేరుకు పెద్దదే అయినా.. సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కొందరి అలక్ష్యం గాంధీ హాస్పిటల్ కు చెడ్డపేరు తెస్తోంది. ఠాగూర్ సినిమాను తలపించేలా గాంధీ ఆసుపత్రి నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రైవేట్ ఆసుపత్రుల కాసుల కక్కుర్తిపై ఆ సినిమా చిత్రీకరించినా.. ఇప్పుడు గాంధీ వైద్యులు మాత్రం బతికుండగానే ఓ యువకుడు చనిపోయినట్లు నిర్ధారించారు. మరుసటి రోజు డ్యూటీ మారిన వేరే డాక్టర్ నిశితంగా పరిశీలించి వైద్యం అందించడంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాణాలతో చెలగాటం
గాంధీ ఆసుపత్రి మరోసారి అభాసుపాలయింది. బతికుండగానే ఓ యువకుడు చనిపోయినట్లు ధృవీకరించిన వైద్యుల నిర్లక్ష్యం దుమారం రేపుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడికి వైద్యం అందించకుండానే చనిపోయినట్లు ధృవీకరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన భాను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మెరుగైన వైద్యం అందించేందుకు అతడిని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.
అయితే ఆ యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం ఇవ్వండంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. దాని తర్వాతనే పోస్టుమార్టం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, పోలీసులు రావడం.. ఇదంతా కూడా కాస్తా సమయం తీసుకుంది. ఆ టైమే ఆ యువకుడిని మృత్యుంజయుడిని చేసింది.
ఆ డాక్టర్ రాకుంటే..!
భానుకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతడు చనిపోయాడంటూ ధృవీకరించారు. చేసేదేమీ లేదంటూ చేతులెత్తేశారు. పోస్టుమార్టం నిర్వహించడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే పోస్టుమార్టం చేయడానికి పోలీసులు రావాల్సి ఉంటుంది. భాను కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం అందించారు. అయితే పోలీసులు రావడానికి కాస్తా సమయం తీసుకుంది. ఆలోగా డ్యూటీ డాక్టర్ మారారు. భాను పరిస్థితి గమనించిన ఆ వైద్యుడు.. అతడు ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చికిత్స అందించడంతో భాను ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ముందుగా వచ్చి ఉంటే, డ్యూటీ డాక్టర్ మారేంతలోపు పోస్టుమార్టమ్ పూర్తయి ఉండేదేమో. ఎందుకంటే భానును మొదట పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయాడంటూ కన్ఫామ్ చేశారు. డ్యూటీ డాక్టర్ మారడంతోనే భాను ప్రాణాలతో బయటపడ్డాడనే విషయం స్పష్టమవుతోంది.
ఆలస్యమే అతడిని కాపాడిందా?
భానును మొదట పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా.. దాదాపు 16 గంటల పాటు అతడు నిర్జీవంగా పడి ఉన్నాడు. వైద్యులు చనిపోయారని చెప్పడంతో పోస్టుమార్టం నిమిత్తం పోలీసులను వెంట పెట్టుకుని వచ్చారు కుటుంబ సభ్యులు. అయితే మీవాడు బతికే ఉన్నాడంటూ అక్కడి సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. భానును మొదట పరీక్షించి చనిపోయాడంటూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.