గాంధీ ఆస్పత్రి కీలక ప్రకటన... నేటి నుంచి నాన్-కోవిడ్ వైద్య సేవలు అందుబాటులోకి...
గత 8 నెలలుగా పూర్తిగా కోవిడ్ 19 సేవలు అందిస్తూ వచ్చిన గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి సాధారణ వైద్య సేవలను పునరుద్దరించనున్నారు. శనివారం(నవంబర్ 21) నుంచి అన్ని విభాగాలకు సంబంధించిన అవుట్ పేషెంట్(ఓపీ),ఇన్పేషెంట్(ఐపీ) సేవలతో పాటు అత్యవసర శస్త్ర చికిత్సలు అందించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
కరోనా వ్యాక్సిన్పై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం... కీలక అప్డేట్స్ ఇవే...
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో కరోనా కేసులు మూడు వందల లోపే ఉండటంతో ఇక సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్,నాన్ కోవిడ్ సేవలకు ఇప్పటికే వేర్వేరు ఏర్పాట్లు చేశామని... నిబంధనల మేరకే రోగులను ఆస్పత్రిలోకి అనుమతిస్తామని చెప్పారు. క్యాజువాలిటీ దగ్గరలోని ర్యాంప్ వద్ద అవుట్ పేషంట్ సేవలను అందించనున్నట్లు చెప్పారు. కోవిడ్,నాన్ కోవిడ్ పేషెంట్లు కలిసిపోతే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో... అలాంటి అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కోవిడ్,నాన్ కోవిడ్ భవనాల్లో.. ఒకదాని నుంచి మరో దానిలోకి వెళ్లకుండా స్పష్టమైన మార్కింగ్ చేసినట్లు చెప్పారు.
Recommended Video
కాగా,శుక్రవారం(నవంబర్ 20) రాత్రి 8గంటల వరకు తెలంగాణలో కొత్తగా 925 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,62,653కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,426కి చేరింది. నిన్న ఒక్కరోజే 42,077 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 50,92,689కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,367 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,49,157కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీళ్లలో 9,714 మంది ప్రస్తుతం హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.