వినాయక చవితికి చందాలు బందే.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే అంతే..!
హైదరాబాద్ : వినాయక చవితి ఉత్సవాలకు మండపాల నిర్వాహకులు సిద్ధమవుతుంటే.. మరోవైపు పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో చందాలు వసూలు చేసే దందారాయుళ్లపై కన్నేశారు. చందాల పేరుతో అసాంఘిక శక్తులు రెచ్చిపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇక భాగ్యనగరంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బలవంతపు చందాలకు చెక్.. అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు..!
వినాయక నవరాత్రులకు భాగ్యనగరం ముస్తాబు కానుంది. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గణేశ్ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఉత్సవాల పేరిట బలవంతపు చందాలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. చందాల పేరు చెప్పి అసాంఘిక శక్తులు రెచ్చిపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్లో గణేశ్ ఉత్సవ కమిటీల పేరుతో బలవంతంగా చందాల వసూళ్లకు పాల్పడొద్దని సూచించారు.
భూమి
మాయం
చేశారు..
రికార్డుల్లో
పేరు
మార్చారు..
గోతిలోకి
దిగి
జర్నలిస్ట్
వింత
నిరసన
(వీడియో)
మండపాలకు పర్మిషన్ తప్పనిసరి.. 22 నుంచి 26 వరకు అప్లికేషన్లు..!
చందాల పేరుతో ఎవరైనా ఇబ్బందులు పెడితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు అంజనీ కుమార్. అంతేగాకుండా మండపాల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదన్నారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఆయా పోలీస్ స్టేషన్లలో అప్లికేషన్స్ తీసుకుని.. 29వ తేదీ లోపు సమర్పించాలని కోరారు.
దరఖాస్తులతో పాటు నో ఆబ్జెక్షన్, అవసరమైన ఇతర పత్రాలు పొందుపరచాలని వివరించారు. మండపాల ఏర్పాటులో అన్నీ సక్రమంగా ఉన్నాయని భావిస్తేనే పోలీసులు అనుమతి ఇస్తారని తెలిపారు. ఇక మండపాల దగ్గర ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని సూచించారు. అవి కూడా బాక్సు టైపు లౌడ్ స్పీకర్లు మాత్రమే వాడాలని చెప్పారు. ఇష్టమొచ్చినట్లుగా సౌండ్ పెంచుతూ చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగించొద్దని కోరారు.
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా.. నిఘా వ్యవస్థ పటిష్టం
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా నగర పోలీసులు సన్నద్దమవుతున్నారు. ఆ క్రమంలో తొలి రోజు నుంచి నిమజ్జనం చివరి రోజు వరకు నిఘా పెంచాలని పోలీస్ అధికారులకు సూచించారు అంజనీ కుమార్. నగరాన్ని జల్లెడ పట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇక టపాసులు కాల్చడంపై కూడా ఆంక్షలు విధించనున్నారు. రోడ్ల వెంబడి, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషేధించేలా ఉత్తర్వులు కూడా జారీ చేయనున్నారు. ఇతరులను ఇబ్బంది పెట్టేలా నిర్లక్ష్యపు చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆ క్రమంలో మండపాల నిర్వాహకులు అన్నింటికీ బాధ్యత వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.