జై జై గణేశా.. బై బై గణేశా.. మూడో రోజు నుంచే నిమజ్జనం.. భారీ బందోబస్తు..!
హైదరాబాద్ : వినాయక చవితి అంటే చాలు భాగ్యనగరం గుర్తుకొస్తుంది. అందులో ముందుగా ఖైరతాబాద్ పెద్ద గణేశుడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాడు. ఇక గణేశ్ చతుర్థి ప్రారంభ సందడి మొదలు నిమజ్జనం కార్యక్రమం వరకు నగరవాసులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. వినాయక చవితి మొదలు మూడో రోజు నుంచే నిమజ్జనం మొదలవుతుంది. ఆ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రానుండటంతో రక్షణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
మూడో రోజు నుంచే నిమజ్జనం..!
హైదరాబాద్లో వినాయక చవితి సందడి అంతా ఇంతా కాదు. గల్లీలు, బస్తీలు వినాయక మండపాలతో కళకళలాడుతున్నాయి. అయితే గణేశున్ని నిలబెట్టిన మూడో రోజు నుంచే నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ క్రమంలో బుధవారం నుంచి గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి భక్త జనులు సిద్ధమైపోయారు. చివరగా 12వ తేదీన నిమజ్జనం ముగియనుంది. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి నిమజ్జనం కూడా చివరి రోజు జరగనుంది.
ఈ నేపథ్యంలో నగర పోలీస్ శాఖ అలర్టైంది. నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా నిఘా పెంచారు. సిటీ అంతటా దాదాపు 250 ప్రాంతాల్లో వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ సిబ్బందికి స్టాండ్ టు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా డ్యూటీలో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు.
10వ తేదీన మొహర్రం.. ఇటు నిమజ్జనం.. గట్టి బందోబస్తు..!
సున్నిత ప్రాంతాల్లో మరింత నిఘా పెంచారు పోలీసులు. పెద్ద పెద్ద మండపాలతో పాటు కొన్ని కీలకంగా గుర్తించిన మండపాల దగ్గర ప్రతి నిత్యం బాంబ్ స్క్వాడ్స్ విస్తృత స్థాయి తనిఖీలు చేయనున్నాయి. అదలావుంటే 10వ తేదీన మొహర్రం పండుగ నేపథ్యంలో బీబీకా ఆలం ఊరేగింపు జరగనుంది. ఆ నేపథ్యంలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లు
హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 62 వేల గణేశ్ మండపాలు ఏర్పాటు చేశారు. అయితే పండుగకు ఒక రోజు ముందు అంటే ఆదివారం నాటికి నగర పోలీస్ అఫిషియల్ వెబ్సైట్ ప్రకారం 10 వేల 702 మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తీసుకున్నారు. అదలావుంటే ఐదు అడుగుల ఎత్తుకు తక్కువున్న గణేశులను ఏర్పాటు చేస్తే సాధారణంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం లేదు.
ఈ సంవత్సరం హుస్సేన్ సాగర్లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయనేది పోలీస్ అధికారుల అంచనా. వినాయక చవితి ప్రారంభం మొదలు మూడో రోజు నుంచే నిమజ్జనం సందడి మొదలవుతుంది. అలా ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో కూడా గణేశులను నిమజ్జనం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు పోలీసాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసుల సలహాలు, సూచనలు
గణేశ్ నిమజ్జనం కొరకు పోలీసులు పలు సలహాలు, సూచనలు చేశారు. ఎలాంటి పుకార్లను నమ్మకూడదని కోరారు. అవి విస్తరించేలా, ప్రచారం చేసేలా ప్రవర్తించడం నేరమని సూచించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా, రెచ్చగొట్టేలా ఉండకూడదన్నారు. రాత్రి వేళ మండపంలో ఎవరో ఒకరు కాపలా ఉండడం ఉత్తమమని చెబుతున్నారు. మండపం దగ్గర నిర్వాహకులు వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వలంటీర్ల ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలపై నిఘా వేసి ఉంచాలని కోరారు.
అక్రమ విద్యుత్ కనెక్షన్లు నేరమని.. అదే సమయంలో అవి ప్రమాదాలకు హేతువు అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. మండపం పైనుంచి వెళ్లే కరెంట్ తీగలు, హైటెన్షన్ వైర్ల విషయంలో అలర్ట్గా ఉండాలని కోరారు. మండపాల దగ్గర వెలిగించే దీపాలు, అగర్ బత్తీలు తదితర వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు వాడకూడదని ఆదేశించారు.