కిడ్నాప్ డ్రామా ఆడిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?
హైదరాబాద్: ఘటకేసర్ కిడ్నాప్ డ్రామా ఆడిన బీ ఫార్మాసీ విద్యార్థిని(19) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర, షుగర్ మాత్రలు మింగి ఆమె ఆత్యహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
కాగా, కిడ్నాప్ డ్రామా తర్వాత ఆ యువతి ఘట్కేసర్లోని తన మేనమ ఇంట్లో ఇంటోంది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఫిబ్రవరి 10న కిడ్నాప్ అంటూ ఫిర్యాదు
తమ కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారంటూ ఫిబ్రవరి 10న సాయంత్రం బీఫార్మాసీ విద్యార్థిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదే రోజు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అన్నోజీగూడ రైల్వే గేట్కు కాస్త దూరంలో పొదల్లో యువతిని గుర్తించారు. అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ కొంత చిరిగి ఉంది. కాలికి గాయం కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో ఇబ్బందిపెట్టకుండా సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు.
విచారణలో తేలిన నిజాలు..
ఈ క్రమంలో కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్.. ఆ సమయంలో ఘటనా స్థలంలో లేడని సెల్ఫోన్ సిగ్నళ్ల ద్వారా పోలీసులు గుర్తించారు. అప్పటికే అదుపులో ఉన్న అతన్ని మరోసారి పోలీసులు ప్రశ్నించారు. విద్యార్థిని ఆర్ఎల్ నగర్లో దిగలేదని, వేరే స్టాప్లో దిగిందని ఆటో డ్రైవర్ చెప్పారు. తాను తన విధులు ముగించుకుని సినిమాకు వెళ్లి, ఆ తర్వాత మద్యం సేవించి ఇంటికెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు. అతను చెప్పిన వివరాలన్నీ నిజమేనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. రివర్స్ ఇన్విస్టిగేషన్ ప్రారంభించారు.
యువతి చెప్పింది అంతా కట్టుకథేనా..!
అన్నోజిగూడలో యువతిని రక్షించిన స్థలం నుంచి ఆమె ఇంటి బస్టాప్ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. సాయంత్రం 6 నుంచి 7.30గంటల వరకు హెరిటేజ్ స్టాప్, యనంపేట గ్రామం, శ్రీనిధి కళాశాల, ఘట్కేసర్ ప్రధాన రహదారి, ఎన్టీపీ క్రాస్ రోడ్స్ అన్నోజీగూడ గ్రామాల్లో ఆమె ఒంటిరగానే నడిచినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో యువతి చెప్పింది కట్టుకథేనా? అనుమానం వచ్చింది. దీంతో కిడ్నాప్, అత్యాచారం అబద్ధమని నిరూపించేందుకు కావాల్సిన స్పష్టమైన ఆధారాలను, సాక్ష్యాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి సేకరించారు. వాటితో చిన్నపాటి వీడియోను తయారు చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినికి చూపించారు.
పోలీసుల ముందు నిజం ఒప్పుకున్న యువతి..
ఆ తర్వాత అసలు నిజాలు చెప్పాలని యువతిని కోరారు. ఎవరు అత్యాచారం చేశారు, ఏం జరిగింది చెప్పాలన్నారు. తర్వాత చెబుతానని చెప్పడంతో వెనక్కి వచ్చేశారు. తర్వాతి రోజు ఉదయం ఆస్పత్రి నుంచి నేరుగా రాచకొండ పోలీస్ కమిషనరేట్కు వెళ్లిన యువతి తాను చెప్పినదంతా అబద్ధమేనని అంగీకరించింది. ఈ మేరకు వివరాలను మహేష్ భగవత్ తెలిపారు. వాస్తవాలు తెలుసుకునేందుకు తమకు మూడు రోజులు పట్టిందన్నారు. కిడ్నాప్ కథలంటే యువతికి ఇష్టమని, తన సోదరుడు కిడ్నాప్ అయ్యాడంటూ తన స్నేహితురాలికి కూడా చెప్పిందని చెప్పారు. అయితే, పోలీసులను, కుటుంబసభ్యులను తప్పుదోవ పట్టించిన నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యువతి.. ఈరోజు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.