బీజేపీకి షాక్: గ్రేటర్ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ మృతి.. బండి సంజయ్ సంతాపం
తెలంగాణ బీజేపీకి చేడు వార్త. ఆ పార్టీ గ్రేటర్ కార్పొరేటర్ అనారోగ్యంతో కన్నుమూశారు. లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్గౌడ్ చనిపోయారు. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందిన ఆయన.. ఇంకా కార్పొరేటర్గా ప్రమాణస్వీకారం చేయకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
రమేశ్ గౌడ్ మృతిచెందడంతో బీజేపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రమేష్గౌడ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే ఆకుల రమేష్ గౌడ్ కరోనాతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో రమేష్ గౌడ్ ఎల్బీనగర్ మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు.
2001-2006 వరకు ఎల్బీ నగర్ మున్సిపల్ ఛైర్మన్గా రమేష్గౌడ్ పని చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేయకుండానే అనారోగ్యంతో అకాల మరణం చెందారు.
రమేశ్ గౌడ్ మృతిపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పేదల సంక్షేమం కోసం పాటుపడేవారని గుర్తుచేశారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. రమేశ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.