2 వాహనాల్లోనే వెళ్లాలి.. ఐదుగురుకు మించి నో.. రోడ్ షో లో అరగంట గ్యాప్, ఈసీ మార్గదర్శకాలు..
గ్రేటర్ నగారా మోగడంతో.. ఎన్నికలకు సంబంధించి ఈసీ తగిన చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ఉంటుందని స్పష్టంచేసింది. దీంతోపాటు ప్రచారానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అసలే శీతాకాలం కావడంతో ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. సదరు అభ్యర్థికి రూ.5 లక్షల పరిమితిని ఈసీ విధించిన సంగతి తెలిసిందే. ఖర్చుకు సంబంధించి ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపు సమర్పించాలని పేర్కొన్నది.
ఇక ప్రచారానికి సంబంధించి రెండు వాహనాలతో మాత్రమే వెళ్లాలని స్పష్టంచేసింది. అంతకుమించి వెహికిల్స్ అనుమతించబోమని తేల్చిచెప్పింది. ప్రచారం నిర్వహించే సమయంలో భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలని తేల్చిచెప్పింది. భద్రతా సిబ్బంది మినహా ఐదుగురు సభ్యులకు మాత్రమే ఇంటింటి ప్రచారం నిర్వహించుకునే అనుమతి ఇచ్చింది. అభ్యర్థుల రోడ్ షోకు మధ్య కనీసం అర్ధగంట విరామం ఉండాలని తేల్చిచెప్పింది. బహిరంగ సభకు అనుమతి లేదని..రోడ్ షోలో కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. నిబంధనలు పాటించని పార్టీలపై తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ తెలిపింది.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. అందుకోసమే షెడ్యూల్ లోపు ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేసింది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.