ghmc election results: బీజేపీ తొలి గెలుపు, సరూర్నగర్ డివిజన్లో హవా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొదట బీజేపీ జోరు చూపించినప్పటికీ.. తర్వాత టీఆర్ఎస్ దూసుకొచ్చింది. ప్రస్తుతం బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ తొలి గెలుపును నమోదు చేసింది.
జీహెచ్ఎంసీ ఫలితాల వేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్: బీజేపీలో చేరిక ఖాయమే!
మంగళ్హాట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు. మరోవైపు, సరూర్నగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ అభ్యర్థుల హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లతోపాటు తొలి రౌండ్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కొనసాగుతుండగా, ఎన్నికల అధికారులు ప్రకటించిన తొలి రౌండ్ ఫలితాలు పరిశీలిస్తే.. చైతన్యపురి డివిజన్లో బీజేపీ అభ్యర్థి 4వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక గడ్డి అన్నారం డివిజన్లో 2800 ఓట్లతో బీజేపీ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. కొత్తపేట డివిజన్లో 3వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి . ఆర్కేపురంలో 2వేలకుపైగా ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, సరూర్ నగర్ డివిజన్లో 2400కుపైగా ఓట్లతో ముందంజలో ఉన్నారు బీజేపీ అభ్యర్థులు.
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మొదట జోరు చూపించిన బీజేపీ.. ఇప్పుడు రెండో స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అటు అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బీజేపీ గట్టి పోటీనిచ్చింది. పాతబస్తీలోనూ పలు స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను గమనిస్తే బీజేపీ రెండో స్థానంలో, ఎంఐఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. టీడీపీ అడ్రస్ గల్లంతైనట్లే కనిపిస్తోంది.
ఇక టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం మరోసారి దక్కిుంచుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు వెలుడిన ఫలితాల ప్రకారం.. 55 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, 4 స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 7స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో గెలిచింది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో గెలుపొందింది.