పరువు పోగొట్టుకున్నారుగా: ఢిల్లీ నుంచి దిగొచ్చినా: బీజేపీపై మంత్రి తలసాని తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నాటి తీవ్రత ఇంకా సమసిపోనట్టుగానే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో చెలరేగిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య నెలకొన్న క్యాంపెయిన్ హీట్.. ఇంకా అలాగే ఉంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. విమర్శలు, ప్రతి విమర్శలను మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేరు.
గ్రేటర్లో వైసీపీ ఓట్లు ఎవరికి పడినట్టు: రఘునందన్ వ్యాఖ్యల ఎఫెక్ట్?: గులాబీకే గంపగుత్తగా?
రాష్ట్ర ఎన్నికల కమిషన్ను అడ్డుగా టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించిందంటూ బీజేపీ విమర్శించగా.. దాన్ని తిప్పికొడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయం కావడంతో ఆ పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీపై నిప్పలు చెరుగుతున్నారు. ఓ స్థానిక సంస్థ ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఇప్పుడు పరువు పోగొట్టుకున్నట్టయిందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
అమిత్ షా, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా వంటి జాతీయ స్థాయి నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనడం.. తమ పార్టీకి అదనపు బలాన్ని ఇచ్చిందని తలసాని అన్నారు. అంతమంది నాయకులు హైదరాబాద్కు రావడం వల్ల జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఖ్యాతి మరోసారి పెరిగినట్టయిందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రులు.. తమ ప్రచారం సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడలేకపోయారని విమర్శించారు.
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తోంటే.. బీజేపీ అగ్ర నేతలకు హైదరాబాద్ ఎన్నికల ప్రచారం అవసరమైందని మండిపడ్డారు. రైతాంగ సమస్యలను పరిష్కరిండం కంటే కూడా ఎన్నికలే తమకు ప్రధానమని బీజేపీ స్పష్టం చేసినట్టయిందని అన్నారు. బీజేపీ అగ్ర నేల ప్రచారం మొత్తం మతం చుట్టే తిరిగిందని ధ్వజమెత్తారు. అందుకే- ఓటర్లు బీజేపీని దూరం పెట్టారని చెప్పారు. తెలంగాణ ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందని తలసాని చెప్పారు.
హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, వారంతా బీజేపీని వ్యతిరేకించారని అన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారనే విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని తాము కైవసం చేసుకోబోతోన్నామని తలసాని దీమా వ్యక్తం చేశారు. మరో పార్టీ సహాయ, సహకారాలు, మద్దతు అవసరం లేకుండా సొంతంగా మేయర్ స్థానాన్ని అందుకుంటామని అన్నారు.