హంగ్: జీహెచ్ఎంసీకి మళ్లీ ఎన్నికలు -2నెలల్లో కేసీఆర్ సర్కారు ఖతం -విజయశాంతి సంచలనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ సారధి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారు, ఎన్నికల కమిషన్ గ్రేటర్ పోల్స్ జరిపిన తీరుపై ఆక్షేపణలు వ్యక్తం చేసిన ఆమె.. ఏ ఒక్క పార్టీకి మెజార్టీ లేని హంగ్ పరిస్థితిపైనా అనూహ్య డిమాండ్ లేవనెత్తారు. టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు.. ఆ రెండు పార్టీలపై కమలం పోరును ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు.
GHMC Election Results 2020: అమిత్ షాకు షాక్ -ఆ 2టీఆర్ఎస్ ఖాతాలోకి -కవితకు ఎదురుదెబ్బ
ఇదీ ఫైనల్ సీన్..
మొత్తం 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికల తుది ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. గత ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన టీఆర్ఎస్ ఈసారి దారుణంగా 56 సీట్లకు పడిపోయింది. గతంలో 3 సీట్లున్న బీజేపీ అద్భుతంగా రాణించి 48 డివిజన్లలో గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది. సీట్ల సంఖ్యలో తేడా లేకుండా ఎంఐఎం 44 డివిజన్లలో తన పట్టును నిలుపుకున్నది. కాగా, కాంగ్రెస్ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలపై తనదైన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి సొంత పార్టీ కాంగ్రెస్ పేరును ప్రస్తావించకుండా, మిగతా మూడు పార్టీలపై ఇలా వ్యాఖ్యాలు చేశారు..
తూతూ మంత్రంగా ఎన్నికలు..
‘‘విపక్షాలకు అవకాశమివ్వకూడదనే కుట్రతో... వరుస సెలవులున్నప్పుడు పోలింగ్ శాతం తగ్గుతుందని తెలిసీ... రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాల్లో తప్పుల సవరణకు సమయం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు, మృతుల పేర్లు జాబితాల్లో దర్శనమిచ్చాయి. అనుభవం లేని సిబ్బందితో తూతూ మంత్రంగా ఎన్నికలు జరిపేశారు. దీంతో..
మేయర్ సీటు గల్లంతు..
కనీసం 100 డివిజన్లలో విజయం ఖాయమని జబ్బలు చరిచిన టీఆరెస్ చివరికి మొత్తం స్థానాల్లో దాదాపు మూడోవంతుకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గులాబీ నేతల హామీలు నీటి మీద రాతలేనని ఓటర్లు బాగా గ్రహించారు. సీట్లు తక్కువొచ్చినా ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ, తీరా చూస్తే ఎంఐఎం మద్దతు లేకుండా టీఆరెస్కి మేయర్ సీటు దక్కేలా లేదు. మరి..
2 నెలల్లో సర్కారు కూల్చేస్తామని..
ఎంఐఎం మద్దతు లేకుండా మేయర్ సీటును టీఆర్ఎస్ గెలవలేని పరిస్తితిలో కేసీఆర్ కు అగ్ని పరీక్ష ఎదురైంది. ఇన్నాళ్ళూ కవల పిల్లల్లా ఉంటూ వచ్చిన టీఆర్ఎస్-ఎంఐఎంలకు ఇప్పుడు కమల పరీక్ష ఎదురైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అవసరం లేదని టీఆరెస్ నేతలు... తల్చుకుంటే గులాబీ సర్కారును 2 నెలల్లో కూల్చుతామని ఎంఐఎం నేతలు బీరాలు పలికారు. అలాంటప్పుడు..
గ్రేటర్కు మళ్లీ ఎన్నికలు?
మేయర్ పీఠం విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు గతంలో చెప్పిన మాటమీద ఉంటారా? హంగ కార్పొరేషన్ ఏర్పడిన వేళ.. మేయర్ పదవి దక్కకపోయినాసరే.. ఎంఐఎంతో కలిసేదే లేదనే మాటకు కట్టుబడి ఉన్నట్లయితే జీహెచ్ఎంసీలో మళ్ళీ ఎన్నికలకు సిద్ధమని టీఆరెస్ చెప్పాలి. నిజం చెప్పాలంటే కవలల అసలు రంగు బయటపడే సమయం ఇప్పుడే ఆసన్నమైంది'' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.