గ్రేటర్ మేయర్:చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక -ఎంఐఎం-బీజేపీకి అదొక్కటే ఆప్షన్ -సంచలన సమీకరణలు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఎన్నికల ఘట్టంలో చివరి అంకమైన మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక మాత్రం ఇంకా మిగిలే ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎంలు హోరాహోరీగా తలపడటం, చివరికి హంగ్ ఫలితం వచ్చిన నేపథ్యంలో ఈ రెండు పదవులు ఎవరిని వరించబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతున్నది. మూడు పార్టీలూ భిన్న వ్యూహాలు సాగిస్తుండగా, సంచలన సమీకరణలు కొన్ని చర్చనీయాంశం అయ్యాయి.
Recommended Video
బీజేపీపై కేసీఆర్ పోరు: భారత్ బంద్లో టీఆర్ఎస్ శ్రేణులు -ఫెడరల్ చర్చలు -10 నుంచి ప్రజాక్షేత్రంలోకి
మేయర్ ఎన్నిక ఇలా..
మొత్తం 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడగా, కీలక అంకమైన మేయర్ ఎన్నికకు సంబంధించి తొలుత.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను సమావేశపరుస్తారు. తొలి సమావేశం ప్రారంభంలోనే ప్రమాణ స్వీకారాల ఘట్టం ఉంటుంది. ఆ వెంటనే మేయర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి, చేతులెత్తే పద్ధతిలో మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. అన్ని పార్టీల సభ్యులకూ విప్ వర్తిస్తుంది. మేయర్ ఎన్నికైన తర్వాతే డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహిస్తారు.
వాయిదా పడితే కోరం అక్కర్లేదు..
ఓటు హక్కున్న సభ్యుల్లో(కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియోలు) కనీసం సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. ఒకవేళ కోరం లేకున్నా, వరుసగా రెండు రోజులు సమావేశాలు వాయిదా పడినా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన తేదీలో మేయ్ ఎన్నిక ఉంటుంది. అప్పుడు కోరంతో సంబంధం ఉండదు. రిజర్వేషన్ ప్రకారం ఈసారి మేయర్ పదవి మహిళలకు దక్కనుంది. డిప్యూటీ మేయర్కు ఎలాంటి రిజర్వేషన్ లేదు. మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ తర్వాత నిర్ణీత గడువులో ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే.. ఓటు హక్కున్న సభ్యులతో చేతులెత్తే పద్దతిలో ఎన్నిక జరుపుతారు. ఈ ప్రక్రియకు హైదరాబాద్ కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా,
బీజేపీపై కేసీఆర్ పోరు: భారత్ బంద్లో టీఆర్ఎస్ శ్రేణులు -ఫెడరల్ చర్చలు -10 నుంచి ప్రజాక్షేత్రంలోకి
పార్టీల బలాబలాలు ఇవే..
గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా తుది ఫలితాల మేరకు, నెరేడ్ మెట్ డివిజన్ తో కలిపి టీఆర్ఎస్ కు 56 సీట్లు, బీజేపీ-48, ఎంఐఎం-44 సీట్లు, కాంగ్రెస్-2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎక్స్-అఫిషియోలతో కలిపి పార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. ఇద్దరు సభ్యులున్న కాంగ్రెస్ కు ఒక ఎక్స్-అఫిషియోతో కలిపి మూడు ఓట్లు ఉంటాయి. 48 మంది కార్పొరేటర్లున్న బీజేపీకి ముగ్గురు ఎక్స్-అఫిషియోలతో కలిపి 51 ఓట్లుంటాయి. 44 మంది కార్పొరేటర్లు ప్లస్ 10 ఎక్స్-అఫీషియోలతో ఎంఐఎం బలం 54ఓట్లు. ఇక లార్జెస్ట్ పార్టీ టీఆర్ఎస్ కు 56 మంది కార్పొరేటర్లు, 35 మంది ఎక్స్-అఫిషియోలతో కలిపి 91 ఓట్లున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో మూడు పార్టీలూ మేయర్, డిప్యూటీ మేయర్ పదవి కోసం పోటీది దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..
ఎంఐఎం అదిరిపోయే వ్యూహం..
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించి సంచలన సమీకరణలు చర్చనీయాంశం అయ్యాయి. బీజేపీ గనుక మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. అది ఎలాగో సాధ్యం కాదు కాబట్టి టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీల చీకటి బంధాన్ని బట్టబయలుచేసేలా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. ఇందుకు ధీటుగా ఎంఐఎం సైతం పక్కా ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. బీజేపీ గనుక మేయర్ సీటుకు అభ్యర్థిని పోటీలోకి నిలబెడితే, తాను కూడా క్యాండిడేట్ ను బరిలోకి దించాలని ఎంఐఎం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ మూడు పార్టీలూ మేయర్ పదవి కోసం పోటీ పడితే అప్పుడు టీఆర్ఎస్ తేలికగా గెలుస్తుంది. తద్వారా కేసీఆర్ ఫాయిదా చేస్తూనే, టీఆర్ఎస్ తోపోరాడిన పేరు ఎంఐఎంకు దక్కుతుంది. ఒకవేళ మేయర్ సీటును మజ్లిస్ కు కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధమైనా తనకున్న బలంతో బీజేపీ అడ్డుకోలేదు. కానీ అది రాజకీయంగా టీఆర్ఎస్ కు సూసైడల్ నిర్ణయం అవుతుంది. ఎలా చూసినా మేయర్ పీఠం టీఆర్ఎస్ కే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే..
ఫిబ్రవరి 10 తర్వాతే మేయర్ ఎన్నిక
టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన 55 మంది కార్పొరేటర్లలో 31 మంది మహిళలే కావడం గమనార్హం. ఈసారి మేయర్ పీఠం మహిళకు రిజర్వ్ కావడంతో టీఆర్ఎస్ లోనే గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా, నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవలో నిమగ్నమయ్యే వారికే ప్రాధాన్యతనివ్వాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ముగియనున్న నేపథ్యంలో, ఆ తర్వాతే కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నికల ప్రక్రియ చేపడతారు.