గ్రేటర్ దెబ్బ: బీజేపీ పేరెత్తని కేటీఆర్ -ఫలితాలపై అనూహ్య వ్యాఖ్యలు -అందుకే ఓడిపోయాం
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి పట్టుమని 60 సీట్లు కూడా పొందలేక, 58 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, ఎక్స్ అఫీషియో ఓట్లను కలుపుకున్నా, మేయర్ స్థానం నిలుపుకోవడం సవాలుగా మారిన తరుణంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఫలితాలపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఎక్కడా బీజేపీ, ఎంఐఎంల పేర్లను కేటీఆర్ ప్రస్తావించలేదు.
GHMC Election Results 2020: బీజేపీ గెలుపులో పవన్ కల్యాణ్ పాత్ర -ఏపీ నేతలు వచ్చుంటే?
ఆశించిన ఫలితం రాలేదు
జీహెచ్ఎంసీలోని మొత్తం 150 వార్డులకుగానూ టీఆర్ఎస్ 58 సీట్లు, బీజేపీ 48, ఎంఐఎం 43, కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లే పొందిన బీజేపీ.. దుబ్బాక ఉప పోరు జోరుతో భారీగా బలాన్ని పెంచుకోవడమే కాదు.. మేయర్ సీటు కోసం అనివార్యంగానైనా ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితిలోకి టీఆర్ఎస్ ను నెట్టేసింది. శుక్రవారం ఫలితాల వెల్లడి తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని ఆయన పేర్కొన్నారు.
స్వల్ప తేడాతో సీట్లు పోయాయి..
‘‘గ్రేటర్ లో ఈ ఫలితాలు మేం ఆశించినవి కాదు. ప్రస్తుతం వచ్చిన స్థానాలకు(58కి) అదనంగా మరో 20 నుంచి 25 స్థానాలు వస్తాయని ఆశించాం. అంతెందుకు, పోలింగ్ సరళిగానీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలుగానీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉండింది. టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ అంచనాల్లో వెల్లడి అయింది. దానికి తగ్గట్లే, 10 -15 స్థానాల్లో చాలా స్వల్ప ఓట్ల తేడాతో మేం ఓటమి చెందం. బీఎన్ రెడ్డి కాలనీలో 18 ఓట్ల తేడాతో, మౌలాలిలో 200, అడిక్మెట్లో 200, మల్కాజ్గిరిలో 70 ఓట్లు.. ఇలా చాలా చోట్ల జరగడం వల్లే మా అభ్యర్థులు గెలవలేకపోయాయి. అయితే..
నిరాశ లేదు.. పోస్ట్మార్టమ్..
జీహెచ్ఎంసీ ఫలితాలు ఆశించిన స్థాయిలో రానప్పటికీ టీఆర్ఎస్ పార్టీగా మేం నిరాశ చెందడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. సీట్ల సాధనలో ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ పొరపాటు జరిగింది అనే విషయాలను పార్టీలో కూర్చొని మాట్లాడుకుంటాం. ఫలితాలపై సమీక్ష చేసుకుంటాం. ఈ సందర్భంగా..
ఓట్లేసిన అందరికీ థ్యాంక్స్..
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించిన హైదరాబాద్ ఓటరు మహావయులందరికీ హృదయపూర్వక దన్యావాదాలు చెబుతున్నాను. అలాగే అభ్యర్థుల విజయం కోసం పాటుపడిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా వారియర్లకు పేరుపేరునా పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను'' అని మంత్రి కేటీఆర్ ముగించారు. తన 6 నిమిషాల ప్రసంగంలో కేటీఆర్ బీజేపీ పేరును మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే..
Recommended Video
మేయర్ ఎన్నిక ఇప్పుడే కాదు..
గ్రేటర్ ఫలితాలపై స్పందిస్తూ మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బల్దియా మేయర్ ఎవరనేదానిపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో ఒకరిద్దరు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నా, ఆ వార్తకు విరుద్ధంగా కేటీఆర్ మాట్లాడారు. మేయర్ ఎన్నికకు ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి, అప్పటిలోగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. టీఆర్ఎస్ ఇప్పుడు సాధించిన సీట్లకుతోడు ఎక్స్ అఫీషియో ఓట్లను కలుపుకొన్నా మేయర్ పీఠం నిలబెట్టుకోవడం సవాలుతో కూడిన ప్రక్రియేనని, ఒకవేళ టీఆర్ఎస్ గనుక ఎంఐఎం మద్దతు తీసుకుంటే, అది రాజకీయంగా బీజేపీకి మరింత బలం చేకూర్చినట్లవుతుందని విశ్లేషకులు అంటున్నారు.