భాగ్యనగర్ ప్రజలకు యూపీ సీఎం యోగి థాంక్స్.. గ్రేటర్లో మెజార్టీ సీట్లు సాధించిన కమలం..
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 48 డివిజన్లు గెలుచుకొని అధికార టీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే బీజేపీ అనుకూల పవనాలు వీచినా.. 20 నుంచి 30 డివిజన్లు గెలుచుకుంటుందని భావించారు. కానీ అనూహ్యంగా హాఫ్ సెంచరీకి దగ్గరగా నిలిచింది. దీంతో కమలదళ శ్రేణులు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. అయితే బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కడంపై ఆ పార్టీ శ్రేణులతోపాటు నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. బీజేపీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచిన భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామని ప్రకటించారు. ఈ కామెంట్ అప్పట్లో సంచలనంగా మారింది. అయినా గ్రేటర్ వయోజనులు కమలదళం వైపు మొగ్గుచూపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ దుందుబి మోగించిన సంగతి తెలిసిందే. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం వికసించింది. ఇటీవల నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆరు నెలల్లో సాగర్ ఉప ఎన్నిక కూడా ఉండనుంది.
Recommended Video