కేసీఆర్ ఓటమిపై జగన్ పార్టీ ఎద్దేవా -టీఆర్ఎస్ కన్ను లొట్ట -టీడీపీ చచ్చిపోయింది -బీజేపీ పేరెత్తని వైసీపీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కేసీఆర్, జగన్ల మధ్య జలజగడాలు, విభజన గొడవలు ఎన్నున్నా.. పరస్పరం గౌరవించుకోవడంలో, పిలిచి పీటేసి భోజనాలు పెట్టడంలో ఎవరికివారే సాటి అన్నట్లుగా వ్యవహరించడం తెలిసిందే. గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవాలని, గెలుస్తుందని కేసీఆర్ మనస్ఫూర్తిగా కోరడం, ఫలితాలు కూడా అలాగే రావడం విదితమే. కొంతకాలంగా కామన్ భేటీలు లేకున్నా రెండు రాష్ట్రాల అధినేతల మధ్య సత్సంబంధాలే కొనసాగుతున్నాయి. అయితే, గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి..
హంగ్: జీహెచ్ఎంసీకి మళ్లీ ఎన్నికలు -2నెలల్లో కేసీఆర్ సర్కారు ఖతం -విజయశాంతి సంచలనం
జీహెచ్ఎంసీ ఫలితాలపై..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)లో మొత్తం 150 డివిజన్లుండగా, శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో 99 సీట్లన్న టీఆర్ఎస్ ఈసారి 56 సీట్లకు పడిపోయింది. మూడు సీట్ల బీజేపీ ఇప్పుడు ఏకంగా 48 డివిజన్లలో గెలుపొంది బాగా పుంజుకుంది. ఎంఐఎం తన 44 సీట్లను కాపాడుకోగా, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇక టీడీపీ మాత్రం సీట్లేమీ సాధించకుండా డకౌట్ గా నిలిచింది. గ్రేటర్ ఎన్నికలపై వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చావు తప్పి కన్ను లొట్టబోయింది..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి కూడా 100 పైచిలకు స్థానాలు సాధిస్తామన్న టీఆర్ఎస్ పార్టీ.. కేవలం 56 సీట్లకు పడిపోవడం, ఎక్స్ అఫీషియో ఓట్లతోనైనా మేయర్ స్థానాన్ని దక్కించుకోలేని స్థితికి దిగజారడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఎంఐఎంతో పొత్తు లేదని ముందు నుంచే చెబుతోన్న టీఆర్ఎస్.. మేయర్ సీటుకోసం తిరిగి మజ్లిస్ సు ఆశ్రయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా తయారైందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అంతేకాదు..
టీడీపీ చచ్చిపోయింది..
గ్రేటర్ ఎన్నికల్లో 150 స్థానాలకు గానూ ఈ సారి 106 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ.. ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలవలేదు సరికదా, పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 82 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక వార్డును గెలుచుకున్న టీడీపీ.. ఈసారి సున్నా దగ్గరే నిలిచింది. దీంతో ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ చచ్చిపోయింది''అని అంబటి వ్యాఖ్యానించారు. రెండు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ను ఉద్దేశించి.. కొనఊపిరితో ఉందన్నారు. కాగా,
బీజేపీపై వైసీపీ నో కామెంట్..
శుక్రవారం వెలువడిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుతమైన ప్రదర్శనతో దాదాపు ఐదు పదుల సీట్లు గెలుచుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమకు మేయర్ సీటు దక్కకున్నా, పార్టీ నేతలు పోరాడిన తీరును అభినందిస్తూ బీజేపీ జాతీయ నేతలు వరుస ప్రకటలను చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ల దుస్థితిపై కామెంట్లు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు.. బీజేపీని ఉద్దేశించి ఒక్కమాట అనకపోవడం గమనార్హం. ఎన్డీఏ మిత్రులే కాదుపొమ్మంటున్నవేళ బీజేపీ ప్రవేశ పెట్టిన కీలక బిల్లులకు మద్దతిస్తూ కేంద్రంతో వైసీపీ సత్సంబంధాలు కొనసాగిస్తోండటమే ఇందుకు కారణమా? అలాంటప్పుడు బీజేపీ గెలుపుపై మాట్లాడినా తప్పేముంది? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.