GHMC elections 2020: కేసీఆర్కు ఉగ్రవాదులతో లింక్: బండి సంజయ్కు కేటీఆర్ కౌంటర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సరళి..ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో వాడివేడిగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం వాగ్యుద్ధానికి దిగుతున్నారు. విమర్శలకు పూనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై చేసిన ఆరోపణలను తిప్పికొడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇంతకంటే దిగజారుడు ఉండదని మండిపడుతున్నారు.
జగన్ కాళ్లకు కట్టుకట్టిన డాక్టర్కు తిరుపతి ఎంపీ టికెట్ : దుర్గా ప్రసాద్ ఫ్యామిలీకి ఎమ్మెల్సీ
ముఖ్యమంత్రి కేసీఆర్.. మజ్లిస్ నేతలతో కుమ్మక్కయ్యారని, ఆయనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయంటూ బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రతి కదలికపైనా కేంద్ర విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆయనను డేగకళ్లతో కనిపెట్టాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో 30 శాతం ఉన్న ముస్లింలకు ప్రతినిధిగా కేసీఆర్ మాట్లాడుతున్నారని, 80 శాతం మంది హిందువుల గురించి ఎందుకు గొంతు ఎత్తట్లేదని నిలదీశారు. ఈ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
Recommended Video
బీజేపీ నేతలు హేట్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్పై చేసినవన్నీ నిరాధార ఆరోపణలేనని కొట్టి పారేశారు. ఉగ్రవాదులతో లింకులు సంబంధాలు ఉన్నాయంటూ అనుమానించడం కంటే దిగజారుడుతనం మరొకటి ఉండబోదని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమే అయినప్పటికీ.. ఇంత దిగజారుడు విమర్శలు చేయడం సహేతుకం కాదని చెప్పారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎవ్వరూ సమర్థించట్లేదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను ఎదుర్కోవాల్సిన జాతీయ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు. అసంబద్ధంగా, అశాస్త్రీయంగా, హాస్యాస్పద ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.