అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా: పచ్చగా ఉండే హైదరాబాద్పై కుట్రలా-కమలంపై కేటీఆర్ ఫైర్
అభివృద్ధి కావాలా... అరాచకం కావాలా.. ఇది అమాయకపు అహ్మదాబాదు కాదు.. హుషారైన హైదరాబాద్.. ఇది కేటీఆర్ పంచ్ డైలాగ్స్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కూకట్ పల్లిలో ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోకు భారీగా జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. హైదరాబాదులో తాము చేసిన అభివృద్ధి పనులను 100 చూపుతామని కేంద్రంలో ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం హైదరాబాదులో చేసిన ఒక్క అభివృద్ధి పనైనా చూపిస్తారా అంటూ సవాల్ చేశారు.
కమలం పార్టీపై రామన్న కన్నెర్ర
గ్రేటర్ ఎన్నికల వార్ ఊపందుకుంది. శుక్రవారంతో నామినేషన్లకు గడువు ముగియడంతో ఆయా పార్టీలు ప్రచారంలో బిజీగా మారాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున మంత్రి కేటీఆర్ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ... టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం షురూ అయ్యింది. కూకట్ పల్లిలో రోడ్ షో నిర్వహించిన మంత్రి కేటీఆర్ హైదరాబాదుకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా కమలం పార్టీ , ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్.
కమలం పార్టీకి కళ్లు మండుతున్నాయి
హైదరాబాదు నగరం సర్వమత సమ్మేళనంకు ప్రసిద్ధి గాంచిందని చెప్పుకొచ్చిన మంత్రి కేటీఆర్.. అలాంటి హైదరాబాదు నగరం పచ్చగా ఉంటే కాషాయం పార్టీ వారి కళ్లు మండుతున్నాయని మండిపడ్డారు. కావాలనే మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక జుమ్మా రోజు కావాలనే బండి సంజయ్ ధర్నా చేశారు. చార్మినార్లోని భాగ్యలక్ష్మీ ఆలయంను మాత్రమే బండి సంజయ్ ఎందుకు ఎంచుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తాడ్బండ్లోని హనుమాన్ ఆలయం, బల్కంపేట్లోని అమ్మవారి ఆలయం ఉండగా అక్కడికి మాత్రమే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అక్కడ ముస్లిం హిందువులు కలిసి ఉండటాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారని అక్కడ కలహాలు సృష్టించేందుకు మాత్రమే సంజయ్ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
వరద సాయంను అడ్డుకున్నదెవరు..?
ఆరేళ్లుగా హైదరాబాదును ఏవిధంగా అయితే అభివృద్ధి చేస్తున్నామో మరోసారి టీఆర్ఎస్కు ఓటు వేసి ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ అభ్యర్థించారు. పచ్చగా సుఖంగా ఉండే హైదరాబాదు కావాలా లేక తెల్లారితే కర్ఫ్యూల మధ్య బతుకులు సాగే హైదరాబాదు కావాలో ఓటర్లు ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏరకమైన హైదరాబాదు ఉంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించుకోవాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాదుకు గూగుల్, అమెజాన్, యాపిల్లాంటి బడా కంపెనీలు వచ్చాయంటే అందుకు కారణం కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పారు. ఇక గత వందేళ్లలో ఎప్పుడూ లేని వరదలు హైదరాబాదును ముంచెత్తాయని ఎంతో మంది నష్టపోయారని చెప్పిన కేటీఆర్... వారందరిని ఆదుకునేందుకు రూ.10వేలు సహాయం చేస్తుంటే దాన్ని అడ్డుకున్నదెవరని ప్రశ్నించారు.