GHMC Elections 2020: మజ్లిస్ టికెట్పై పోటీ చేసి గెలుపొందిన హిందూ అభ్యర్థులు వీరే..!
హైదరాబాదు: గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఎవరూ ఊహించనంతగా వచ్చాయి. సొంతంగా మేయర్ పదవి పొందేందుకు ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ సారి గ్రేటర్ ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. 99 స్థానాల నుంచి 55 స్థానాలకు కారు పార్టీ పడిపోగా... 4 స్థానాల నుంచి 48 స్థానాలకు కాషాయం పార్టీ ఎగబాకింది. ఇక మజ్లిస్ పార్టీ కూడా షరా మామూలుగానే తమ పరిధిలో సత్తా చాటింది. ఇక మేయర్ పీఠంపై అన్ని పార్టీలు కుస్తీ పడుతున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వచ్చాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీఆర్ఎస్కే అనుకూలంగా చెప్పగా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపించింది. ఇక బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో టీఆర్ఎస్కు భవిష్యత్తులో బీజేపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం కొన్ని ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ మేయర్ పదవి చేపట్టాలంటే మజ్లిస్ నాయకుల సహకారం తీసుకోవాల్సిందే. దీనిపై గులాబీ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముస్లింలను రిప్రజెంట్ చేసే మజ్లిస్ పార్టీలో ఇద్దరు హిందూ మతానికి చెందిన వారు గెలుపొందడం విశేషం.
ముస్లింలకు ప్రతీకగా నిలిచే మజ్లిస్ పార్టీ టికెట్ పై ఇద్దరు హిందువులు పోటీ చేసి గెలిచారు. మొత్తం 44 స్థానాలను మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇందులో 42 మంది విజేతలు ముస్లింలు కాగా ఇద్దరు మాత్రం హిందువులు ఉండటం విశేషం. మొత్తం మీద మజ్లిస్ పార్టీ నుంచి ఐదుగురు హిందు అభ్యర్థులు పోటీ చేయగా ఇందులో ముగ్గురు ఓటమిపాలు కాగా ఇద్దరు విజేతలుగా నిలిచారు. పురానాపూల్ నుంచి మజ్లిస్ టికెట్ పై పోటీ చేసిన సున్నం రాజ్మోహన్ విజయం సాధించగా... ఇదే పార్టీ నుంచి ఫలక్నుమా అభ్యర్థిగా పోటీచేసిన కె.తారాభాయ్ గెలుపొందారు. మిగతా ముగ్గురు అభ్యర్థులు అంటే కార్వాన్లో పోటీచేసిన మందగిరి స్వామి యాదవ్, జాంబాగ్ నుంచి బరిలో దిగిన జడల రవీంద్ర, కుత్బుల్లాపూర్లోని రంగారెడ్డి నగర్ నుంచి పోటీచేసిన రాజేశ్ గౌడ్లు ఓటమిపాలయ్యారు.
మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని రీతిలో రావడంతో దేశవ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చ జరిగింది. ఎప్పుడూ లేనంతగా బీజేపీ పుంజుకోవడంతో ఇక కారు గేరు వేయకుండా భవిష్యత్తులో నిలువరిస్తుందని సోషల్ మీడియా వేదికగా చర్చలు జోరందుకున్నాయి.