షేక్పేట్ డివిజన్లో బీజేపీ నేతపై ఎంఐఎం నేతల దాడి, తీవ్రగాయాలు: కారు గుర్తు హైలెట్!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ నేతలు ఘర్షణ పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. తాజాగా, షేక్పేట డివిజన్ పరిధిలో ఎంఐఎం, బీజేపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో డివిజన్లో అలజడి వాతావరణం నెలకొంది.
బీజేపీ నేతలపై ఎంఐఎం నాయకుల దాడి..
షేక్పేట డివిజన్లో ఎంఐఎం నేతలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంఐఎంకు చెందిన పలువురు నేతలు బీజేపీ నాయకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ముఖంపై దాడి చేయడంతో రక్తం కారింది. రిగ్గింగ్ చేస్తుండగా అడ్డుకున్నందుకే ఎంఐఎం నేతలు దాడి చేశారని బీజేపీ నాయకులు తెలిపారు.
పలుచోట్ల టీఆర్ఎస్ దౌర్జన్యానికి దిగుతోందంటూ బీజేపీ..
ఇది ఇలావుంటే, మరికొన్ని చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ‘గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఓటమి భయంతో బిజెపి నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్గౌడ్ అనుచరులు బిజెపి కార్యకర్తపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. టీఆర్ఎస్ దురాగతాలను ప్రజలు క్షమించరు' అని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.
ఓటరు స్లిప్పుల్లో టీఆర్ఎస్కు ఓటేయాలి..
కాగా, వనస్థలిపురం డివిజన్ 44వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు స్లిప్పులో టీఆర్ఎస్కు ఓటు వేయాలని ఉందని బీజేపీ అభ్యర్థి ఆరోపించారు. ఇక, మల్లాపూర్ డివిజన్ శ్రీనివాస్ మోడల్ స్కూల్ వద్ద బీజేపీ, సీపీఐ, టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. 22,23,24,25 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
బ్యాలెట్పై టీఆర్ఎస్ గుర్తు హైలెటె..
మరికొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్ మీద టీఆర్ఎస్కు సంబంధించిన కారు గుర్తును హైలెట్ చేస్తూ దాని చుట్టూ ఒక గడి కొట్టినట్లు ముద్రించారని చెబుతూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఏఎస్ రావు నగర్ వార్డు 2లో, గడ్డి అన్నారం వార్డు నెంబర్ 23లో ఇలా హైలెట్ చేసి ముద్రించారని బీజేపీ తెలిపింది. ఇది ఓటర్లను ప్రలోభపెట్టే అంశంగా ఉందని, ఆ రెండు వార్డుల్లో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది.