నేటి నుంచి గ్రేటర్లో కేటీఆర్ రోడ్ షోలు... సుడిగాలి పర్యటనలు... అక్కడినుంచే ప్రారంభం...
తెలంగాణ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి(నవంబర్ 21) నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కుత్బుల్లాపూర్ నుంచి రోడ్ షోలకు శ్రీకారం చుట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 90 నుంచి 120 రోడ్ షోల్లో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా సిద్దమైంది. గత 2016 ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
శనివారం కుత్బుల్లాపూర్లో తొలి రోడ్ షో నిర్వహించనున్న కేటీఆర్... ఆ తర్వాత కూకట్పల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తా,చిత్తారమ్మ తల్లి చౌరస్తాల్లో ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 7గంటలకు ఐడీపీఎల్ చౌరస్తా, 8గంటలకు సాగర్ హోటల్లో జంక్షన్లో ప్రచారం చేయనున్నారు.ఇలా రోజుకు నాలుగు నుంచి ఆరు రోడ్ షోలలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.
ఇప్పటికే అన్ని డివిజన్లు,నియోజకవర్గాల్లో.. ఎక్కడెక్కడ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలో టీఆర్ఎస్ పక్కా ప్రణాళిక సిద్దం చేసుకుంది. మంత్రులు,ఎమ్మెల్యేలను ప్రచార బాధ్యతల్లో మోహరించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు, తలసాని, ఈటల, మంత్రులు సత్యవతి, సబితా, మహమూద్అలీ, కొప్పుల, పువ్వాడ అజయ్ పేర్లను ప్రకటించింది.
Recommended Video
దుబ్బాకలో ఓటమి నేపథ్యంలో జీహెచ్ఎంసీలో భారీ గెలుపుపై టీఆర్ఎస్ కన్నేసింది. దుబ్బాక ఓటమిని మరిపించేలా 100 పైచిలుకు స్థానాల్లో విజయ దుందుభి మోగించాలనుకుంటోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో 100 స్థానాలకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోవడంతో... ఈసారి ఎలాగైనా 100 పైచిలుకు స్థానాలను గెలిచి తీరాలన్న కసితో ఉంది. ప్రచార పర్వం చివరలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.