ఆరంభంలోనే అగ్ర నేతల ఓటు: పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చొని: కేటీఆర్, కిషన్ రెడ్డి, అసద్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. ఉదయం 7 గంటలకు గ్రేటర్ హైదరాబాాద్ పరిధిలోని పోలింగ్ను ప్రారంభించారు. ప్రధాన పార్టీలకు చెందిన అగ్ర నేతలు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమతి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి తమ ఓటు వేశారు.
Recommended Video
అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వారంతా బూత్లకు చేరుకున్నారు. కిషన్ రెడ్డి కాచిగూడలోని దీక్షా మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూ లైన్లో నిల్చున్నారు. తన వంత వచ్చే వరకూ వేచి చూశారు. అనంతరం ఆయన ఓటు వేశారు.
బంజారాహిల్స్లోని నందినగర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేటీఆర్ ఓటు వేశారు. తన భార్యతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కొద్దిసేపు క్యూ లైన్లో నిల్చున్నారు. అనంతరం కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగగా భావించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ సజావుగా సాగడానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని భావిస్తోన్న అత్యంత సున్నిత ప్రాంతాల్లో మొత్తం 293 పోలీస్ పికెటింగ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంగా మొత్తం 1.45 కోట్ల రూపాయల నగదును, 10 లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 55 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు.
ముందుజాగ్రత్త చర్యగా 3,066 మంది రౌడీషీటర్లపై బైండోవర్ నమోదు చేసినట్లు హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. 4,187 తుపాకులను డిపాజిట్ చేయించుకున్నామని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించడానికి వీలుగా 22 వేల మంది పోలీసులను మోహరింపజేసినట్లు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2,146 పోలింగ్ 1,517 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా, 167 అత్యంత సున్నితమైనవిగా గుర్తించినట్లు వెల్లడించారు.