GHMC elections 2020: మజ్లిస్పై బీజేపీ త్రిపుల్ తలాక్ బ్రహ్మాస్త్రం: ఓటుబ్యాంకు కొల్లగొట్టేలా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార తీవ్రత పీక్స్కు చేరుకుంటోంది.. పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో అన్ని పార్టీలూ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్లలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో పైచేయి సాధించడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్పై తనకు ఉన్న పట్టును నిలబెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి, కాషాయ జెండా ఎగరేలా కమలనాథులు సర్వ శక్తులను ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి.
Recommended Video
పాతబస్తీలో మెజారిటీ స్థానాలపై
అన్ని పార్టీల నజర్.. ప్రస్తుతం పాతబస్తీపై పడింది. 50 డివిజన్లు ఉన్న ఓల్డ్ సిటీలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా మేయర్ పీఠానికి దగ్గర కావాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. పాతబస్తీ.. అఖిల భారత మజ్లిస్-ఇత్తెహాదుల్-ముస్లిమీన్కు కంచుకోట. దశాబ్దాల తరబడి పాతబస్తీవాసులు మజ్లిస్కు పట్టం కడుతున్నారు. టైగర్ ఆలె నరేంద్ర, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి హయాంలో భారతీయ జనతా పార్టీ.. పాతబస్తీలో మజ్లిస్ను ఢీ కొడుతూ వచ్చింది. వారి తరువాత ఆ స్థాయిలో బీజేపీ టఫ్ ఫైట్ను ఇవ్వలేకపోతోంది.
ఈ సారి సానుకూలంగా..
హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని మజ్లిస్ను మట్టికరిపించడానికి బీజేపీ సన్నాహాలు చేపట్టింది. ఈ సారి పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ అనే బ్రహ్మాస్త్రాన్ని మజ్లిస్పై సంధిస్తోంది బీజేపీ. మైనారిటీల మహిళలు శిలాశాసనంలా భావించే త్రిపుల్ తలాక్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అంశాన్ని విస్తృతంగా పాతబస్తీలోకి తీసుకెళ్తోంది. త్రిపుల్ తలాక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రద్దు చేయించడాన్ని ఓటుబ్యాంకుగా మలచుకోవడానికి వ్యూహాలను పన్నింది.
కార్వాన్, గోషామహల్ క్లీన్ స్వీప్పై
కార్వాన్, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి సంప్రదాయ ఓటుబ్యాంకు ఉంది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చి పాతబస్తీలో స్థిరపడిన వారి ఓట్లు బీజేపీకే తప్ప మరో పార్టీకి పడే ప్రసక్తే లేదు. కొంతకాలంగా కార్వాన్ కోటపై మజ్లిస్ జెండా ఎగురుతున్నా బీజేపీకి సాలిడ్ ఓటుబ్యాంకు ఉందక్కడ. ఇదివరకటి మహారాజ్ గంజ్, ఇప్పటి గోషామహల్.. దీనికేమీ తీసిపోదు. అందుకే- ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లను క్లీన్స్వీప్ చేయడంపై కన్నేశారు కమలనాథులు. దీనికోసం త్రిపుల్ తలాక్ అంశాన్ని తమ ప్రచారంలో వినియోగిస్తున్నారు.
కొత్త ప్రాంతాల్లో విస్తరించడంపై..
గోషామహల్, అఫ్జల్ గంజ్, ఆఘాపురా, బొగ్గులకుంట, ధూల్పేట్, రామ్కోఠి, సుల్తాన్ బజార్ వంటి ప్రాంతాల్లో ముస్లిమేతరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారితో పాటు త్రిపుల్ తలాక్ రద్దును అడ్డుగా పెట్టుకుని ముస్లిం ఓటర్లను కూడా ఆకట్టుకోవడానికి పావులు కదుపుతున్నారు. రాజేంద్రనగర నియోజకవర్గం పాతబస్తీలో పరిధిలో ఉన్నప్పటికీ.. మెజారిటీ ఓటుబ్యాంకు ముస్లిమేతరులదే. ఈ నియోజకవర్గం పరిధిని కూడా స్వీప్ చేయాలనే కృతనిశ్చయంతో కనిపిస్తున్నారు.
త్రిముఖ పోరు..
పాతబస్తీలో త్రిపుల్ తలాక్ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేయడం వల్ల మజ్లిస్ ఓటుబ్యాంకును ప్రభావితం చేసేలా బీజేపీ నేతలు వ్యూహాలను పన్నారు. దీనికి అనుగుణంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. కొత్త నియోజకవర్గాల్లో పాగా వేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ఫలితంగా- పాతబస్తీలో త్రిముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. మజ్లిస్-టీఆర్ఎస్-బీజేపీల మధ్య ప్రధానంగా పోరు కొనసాగుతోంది. మెజారిటీ డివిజన్లు ఎవరికి కైవసం అవుతాయనేది తేలాల్సి ఉంది. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా పాతబస్తీ మొనార్క్ ఎవరనేది స్పష్టమౌతుంది.