రేపే జీహెచ్ఎంసీ పోలింగ్... బందోబస్తులో 50వేల మంది పోలీసులు... ఇవీ భద్రతా ఏర్పాట్లు...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. పోలింగ్కి మరికొద్ది గంటలే సమయం ఉండటంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను పోలింగ్ బందోబస్తులో మోహరించారు. ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే 9490617111కు సమాచారం అందించాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
Recommended Video
ఇవీ భద్రతా ఏర్పాట్లు...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్లో 84, సైబరాబాద్లో 38, రాచకొండ పరిధిలో 28, నగర పరిధిలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను బందోబస్తులో మోహరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూమ్స్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ... హైదరాబాద్ కమిషనరేట్లో 89 వార్డులు ఉన్నాయని, 4979 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో 1517 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా,167 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించామన్నారు. 406 మొబైల్ పార్టీలతో ప్రతీ పోలింగ్ స్టేషన్పై నిఘా ఉంటుందన్నారు. ఇప్పటికే 29 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని... 3066 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని చెప్పారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
ఇప్పటికే 4187 గన్స్ వివిధ పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ అయినట్లు అంజనీ కుమార్ తెలిపారు. పోలీసుల తనిఖీల్లో రూ.1.45కోట్లు నగదు పట్టుబడిందన్నారు. పలుచోట్ల భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకూ అందిన 63 ఫిర్యాదుల్లో 55 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశామని... సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ నిఘా ఉంచామన్నారు.మంగళవారం(డిసెంబర్ 1) ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి పోలింగ్ రోజున ఒక్క వార్డు వద్ద ఒక్క వాహనానికే అనుమతిస్తామన్నారు. ఎలక్షన్ ఏజెంట్ కూడా అదే వాహనంలో వెళ్లాల్సి ఉంటుందన్నారు.
4800 మంది రోహింగ్యాలు...
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 13 పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగుతాయని.. ఇందుకోసం 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.ఇప్పటివరకూ 15 లక్షలు విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 4, 800 మంది రోహింగ్యాలు ఉన్నారని... వారిలో 4,500 మందికి బయోమెట్రిక్ నిర్వహించామని చెప్పారు. అందులో 160 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నకిలీ పాస్పోర్టు కలిగిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.