గ్రేటర్ ఎన్నికలు : రేపే సీఎం కేసీఆర్ బహిరంగ సభ... ఇవీ ట్రాఫిక్ ఆంక్షలు...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకున్న వేళ... శనివారం(నవంబర్ 28) ఆ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ... అటు బీజేపీ తరుపున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం... ప్రధాని మోదీ కూడా హైదరాబాద్లో అడుగుపెడుతుండటంతో రేపటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం సభ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఆ సమయంలో ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. సికింద్రాబాద్ నుంచి సభకు వచ్చే వారు పబ్లిక్ గార్డెన్, రవీంద్రభారతి, డాక్టర్ కార్స్ ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఓల్డ్ సిటీ నుంచి వచ్చే వాహనాలు పీపుల్ ప్లాజా వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నిజాం కాలేజీలో పార్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెదీపట్నం నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజ్ గ్రౌండ్ 2,3 వద్ద పార్క్ చేయాల్సి ఉంటుంది. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం,భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసే తరుణం దగ్గరపడుతున్న తరుణంలో... క్లైమాక్స్ ఎంట్రీగా జరుగుతున్న కేసీఆర్ సభ హైదరాబాద్ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో గ్రేటర్లోనూ టీఆర్ఎస్ను సవాల్ చేస్తున్న బీజేపీని ఆయన ఎలా టార్గెట్ చేస్తారు... ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆ పార్టీ ఆరోపణలను ఎలా తిప్పికొడుతారన్న ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఈ సభ తప్పకుండా ఓ గేమ్ ఛేంజర్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు.
Recommended Video
కాగా,డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న కౌంటింగ్.. అదేరోజున ఫలితాలు వెల్లడికానున్నాయి. రీపోలింగ్ అవసరమైతే డిసెంబర్ 3న నిర్వహించనున్నారు.