నేరెడ్మెట్లో టీఆర్ఎస్ గెలుపు... లాస్ట్ పంచ్ గులాబీదే... ఏడుస్తూ వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరెడ్మెట్ డివిజన్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 668 ఓట్ల మెజారిటీతో తెలిపారు. ఓటమిపాలైన బీజేపీ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి ఏడుస్తూ వెళ్లిపోవడం గమనార్హం. నేరెడ్మెట్ డివిజన్ గెలుపుతో గ్రేటర్లో గెలిచిన టీఆర్ఎస్ కార్పోరేటర్ల సంఖ్య 56కి చేరింది. నేరెడ్మెట్లో టీఆర్ఎస్ గెలుపుతో పార్టీ స్థానిక కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆ ఓట్లలో టీఆర్ఎస్కు 429...
హైకోర్టు ఆదేశాల మేరకు నేరెడ్మెట్లో రీకౌంటింగ్ నిర్వహించారు. అలాగే స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించారు. ఈ డివిజన్లో మొత్తం 25,175వేల ఓట్లు ఉండగా... మొదటి రౌండ్ హోరాహోరీగా సాగింది. అయితే రెండో రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలోకి వచ్చింది. చివరకు 668 ఓట్లతో మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. స్వస్తిక్ ముద్ర లేని 544 ఓట్లలో 115 ఓట్లు బీజేపీ అభ్యర్థికికి పోలవగా 429 ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి పోలయ్యాయి.
మీనా ఉపేందర్ రెడ్డి ఏమన్నారు...
ఫలితాల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎన్నికలు,కౌంటింగ్ ప్రశాంతంగా సాగేలా సహకరించిన పోలీసులకు,మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తాను సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని అని... తనకెలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు. తన రాజకీయ గురువు మైనంపల్లి హన్మంతరావు సూచన మేరకు రాజకీయాలకు అతీతంగా తమ డివిజన్ ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు.
హైకోర్టు ఆదేశాలతో నిలిచిన కౌంటింగ్...
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో హైకోర్టు ఆదేశాల మేరకు నేరెడ్మెట్ డివిజన్లో ఓట్ల లెక్కింపును నిలిపివేసిన సంగతి తెలిసిందే.స్వస్తిక్ ముద్రకు బదులు ఇతర ముద్రలు ఉన్న ఓట్లను కూడా లెక్కించాలని కౌంటింగ్ ముందు రోజు అర్ధరాత్రి ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ హైకోర్టులో సవాల్ చేయడంతో... ఇతర ముద్రలు ఉన్న ఓట్లు ఫలితాన్ని నిర్ణయించే పక్షంలో అక్కడ కౌంటింగ్ నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నేరెడ్మెట్ డివిజన్లో ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కౌంట్ చేయలేదు.తాజాగా బుధవారం(డిసెంబర్ 9) ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు.సైనిక్పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు.
నేరెడ్మెట్ డివిజన్ కూడా టీఆర్ఎస్ ఖాతాలో చేరడంతో గ్రేటర్లో ఆ పార్టీ బలం 56 కార్పోరేటర్లకు చేరింది.బీజేపీ 48 డివిజన్లు,ఎంఐఎం 44 డివిజన్లు,కాంగ్రెస్ 2 డివిజన్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఈసారి ఏ పార్టీకి దక్కకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.