ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే తేల్చుకోండి, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంత్రి హరీశ్ రావు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప ప్రతిపక్షాలు చేసేందేమి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని హరీశ్ రావు మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధిని చూసే హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. నగరంలో శాంతి భద్రతల సమస్యలుంటే పెట్టుబడులు ఎలా వయస్తాయి? అని ప్రశ్నించారు. కరోనా, భారీ వరదల సమయంలో ప్రజలకు అండగా ఉన్నది టీఆర్ఎస్ మాత్రమేనని హరీవ్ వ్యాఖ్యానించారు.
గురువారం భారతీనగర్ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. కరోనా వల్ల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. ఇళ్లు లేని పేదలకు త్వరలోనే రెండు పడకగదుల ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నామన్నారు.
ఇప్పుడు నల్లా బిల్లులు కూడా రద్దు చేస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికీ వరద సాయం అందిస్తామన్నారు. ప్రశాంత హైదరాబాద్ కావాలా? లేక విధ్వంస హైదరాబాద్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ సంస్థలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. బీహెచ్ఈఎల్ సంస్థకు రూ. 40వేల కోట్ల ఆర్డర్ ఇచ్చింది కేసీఆరేనని.. సీఎంతో మాట్లాడి ఆసరా పథకం ద్వారా విశ్రాంత ఉద్యోగులకు పింఛను ఇప్పిస్తామని తెలిపారు. అమెజాన్ కంపెనీ హైదరాబాద్ నగరంలో రూ. 21వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు.
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గ్రేటర్ పీఠం మాదే అంటే మాదే అంటూ ప్రచారంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, గ్రేటర్ ప్రజలు ఇచ్చే తీర్పు డిసెంబర్ 4న వెలువడనుంది.